వారసుడు చేసింది తెలివైన పనే

ఎన్ని విమర్శలు వచ్చినా డబ్బింగ్ సినిమాకు ఇంత పెద్ద రిలీజ్ ఏంటని గట్టిగా టార్గెట్ చేసినా వెనుకడుగు వేయకుండా వారసుడుకి మూడు రోజులు ఆలస్యంగా అయినా సరే చిరంజీవి బాలకృష్ణలకు పోటీగా నిలబడిన దిల్ రాజుకి బ్లాక్ బస్టర్ రాలేదు కానీ తెలివైన పని అనిపించేలా ఫలితం దక్కింది. శనివారంతో కలుపుకుని మూడు రోజులకు వారసుడుకి ఎనిమిది కోట్ల దాకా షేర్ రావడం పట్ల ట్రేడ్ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. బ్రేక్ ఈవెన్ అవ్వలేదు కానీ నిజానికి ఇలాంటి రొటీన్ ఫ్యామిలీ కంటెంట్ మాములు టైంలో వచ్చి ఉంటే ఖచ్చితంగా ఫ్లాప్ అయ్యేదన్న అంచనా ఎంత మాత్రం తప్పు కాదు.

ఇలా జరగడానికి కారణం లేకపోలేదు. వాల్తేరు వీరయ్యకు వచ్చిన భీభత్సమైన రెస్పాన్స్ దాదాపు అన్ని సెంటర్లలో ఓవర్ ఫ్లోస్ ని సృష్టించింది. వీరసింహారెడ్డి సైతం బిసి కేంద్రాల్లో గత రెండు మూడు రోజులుగా ఫుల్స్ పెడుతూనే ఉన్నాడు. వీటికి టికెట్లు దొరకని జనాలకు తర్వాత కనిపిస్తున్న ఆప్షన్ వారసుడు మాత్రమే. కళ్యాణం కమనీయం టూ మచ్ క్లాస్ అయిపోగా తెగింపు మనకు సంబంధం లేని జానర్ గా కనిపించేసింది. సహజంగా అదంతా విజయ్ మూవీకి వరంగా మారింది. రెగ్యులర్ గా ఉన్నా సరే పాటలు, ఫైట్లు, సెంటిమెంట్లు గట్రా ఉన్నాయనే మాట టికెట్లు కొనేలా చేసింది.

ఇదంతా దిల్ రాజు ముందస్తు ప్రణాళికలో లేకుండా పోదు. ఊహించే ఉంటారు. విజయ్ ఇమేజ్ ఇలాంటి కంటెంట్ ని తమిళనాడులో నెట్టుకొస్తుంది కానీ తెలుగు రాష్ట్రాల్లో కష్టమని అంచనా వేయలేనంత అనుభవం లేకకాదు. అందుకే రిస్క్ తీసుకుని మరీ మంచి థియేటర్లు వచ్చేలా పావులు కదిపారు. ఇవి పండగ సెలవులు సోమవారం దాకా బాగా పని చేశాయి. ఇవాళ్టి నుంచి వర్కింగ్ డేస్ మొదలయ్యాయి కాబట్టి ఇకపై మొదలయ్యే డ్రాప్ ని అంగీకరించక తప్పదు. ఇంకా ఆరు కోట్లకు పైగానే వసూలు చేయడం అంత సులభం కాదు. వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డిలకు శనివారం నుంచి రెగ్యులర్ రేట్లు అందుబాటులోకి వచ్చేస్తాయి.