బ్యాడ్ టాక్‌తో బాక్సాఫీస్ రాంపేజ్


తమిళంలో టాప్ స్టార్లు ఎవ్వరూ కూడా కొన్నేళ్ల నుంచి సరైన సినిమాలు ఇవ్వట్లేదు. వారి సినిమాలన్నీ డివైడ్ టాక్ తెచ్చుకుంటున్నాయి. అయినా సరే.. వాటితోనే అభిమానులు, ప్రేక్షకులు సంతృప్తి చెందుతున్నారు. భారీ వసూళ్లు కట్టబెడుతున్నారు. రజినీ కెరీర్లోనే వరస్ట్ మూవీస్‌లో ఒకటనదగ్గ ‘అన్నాత్తె’ కూడా అక్కడ హిట్టయిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇక రజినీని మించి విజయ్ పెద్ద స్టార్‌గా ఎదగడానికి దోహదపడిన సినిమాలన్నీ యావరేజ్‌వే. వీరి లాగే అజిత్ సైతం కొన్నేళ్ల నుంచి సరైన సినిమాలను ఇవ్వట్లేదు.

గత ఏడాది ‘వలిమై’ సినిమా చూసి మనోళ్లు పెదవి విరిచారు. కానీ అది తమిళనాట బ్లాక్ బస్టర్ అయి కూర్చుంది. అతను ‘విశ్వాసం’ అనే మామూలు సినిమాతో తమిళనాట ఇండస్ట్రీ రికార్డు కొట్టడం విశేషం. ఇప్పుడు ‘తునివు’ చిత్రంతోనూ అజిత్ బాక్సాఫీస్ రాంపేజ్ అంటే ఏంటో చూపిస్తున్నాడు.

సంక్రాంతి కానుకగా, విజయ్ మూవీ ‘వారిసు’కు పోటీగా రిలీజైన ‘తునివు’ అంత గొప్ప టాక్ ఏమీ రాలేదు. తెలుగులో అయితే ఈ సినిమాను అస్సలు పట్టించుకోలేదు. రివ్యూలు, టాక్ అంతా నెగెటివ్‌గానే వచ్చింది. తమిళంలో మాత్రం అజిత్ అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకులు సైతం ఈ చిత్రాన్ని నెత్తిన పెట్టుకుంటున్నారు. ‘వారిసు’ విజయ్ ఒకప్పటి సినిమాల మాదిరి మ్యాజిక్ చేయలేకపోతోంది. ఓ మోస్తరు వసూళ్లతో నడుస్తోంది. కానీ ‘తునివు’ మాత్రం తమిళనాట బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది.

‘వారిసు’తో పోలిస్తే తమిళనాడు అంతటా ఈ చిత్రానికి మెరుగైన వసూళ్లు వస్తున్నాయి. తొలి రోజు నుంచి ఎక్కడా తగ్గకుండా హౌస్ ఫుల్ వసూళ్లతో ‘తునివు’ దూసుకెళ్తోంది. తమిళనాడులో మాత్రమే వసూళ్లు రూ.100 కోట్లకు చేరువ అవుతున్నాయి. ఫుల్ రన్లో సినిమా రూ.200 కోట్ల గ్రాస్ వసూళ్ల మార్కును అందుకోవడం పక్కా అంటున్నారు ట్రేడ్ పండిట్లు.