చిన్న సినిమా ఏం సాధించినట్టు

ఇండస్ట్రీ పెద్దలు, ప్రొడ్యూసర్లు, వివిధ వర్గాల ప్రతినిధులు తరచు చెప్పే మాట చిన్న సినిమాలు బ్రతకాలి. కేవలం భారీ చిత్రాలతో యాభై నాలుగు శుక్రవారాలను మేనేజ్ చేయడం అసాధ్యం. అందుకే బ్యాలన్స్ చేయడం చాలా కీలకం.

అలా అని రిస్కులను పరిగణనలోకి తీసుకోకుండా వాస్తవ పరిస్థితులను బేరీజు వేసుకోకుండా బరిలో దిగితే నష్టం ఒకరికే కాదు పలు కోణాల్లో అందరికీ ఉంటుంది. దానికి ఉదాహరణే కళ్యాణం కమనీయం. యువి సంస్థ ఉత్పత్తి కావడంతో జనవరి 14న దీనికి చెప్పుకోదగ్గ రిలీజ్ దక్కింది. ఎగ్జిబిటర్లు డిస్ట్రిబ్యూటర్లు సహకరించారు. క్వాలిటీ స్క్రీన్లు వచ్చేలా చేశారు.

తీరా జరిగింది ఏమిటి. గంటన్నర నిడివితో షార్ట్ ఫిలింకి ఎక్కువ సినిమాకు తక్కువ ఫీడ్ బ్యాక్ తో ఈ మూవీ పెద్దగా మెప్పించలేక నీరసపడిపోయింది. పండగ టైంలో మాస్ మసాలాలకే అగ్ర తాంబూలం దక్కుతుందని తెలిసినా కూడా ఇంత సాహసానికి తెగబడటం వల్ల నష్టం ఎవరికి.

మంచి థియేటర్లు ఇవ్వడం వల్ల వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డిలకు అదనంగా రావాల్సిన రెవిన్యూ ఆడియన్స్ తిరిగి ఇంటికి వెళ్లిపోవడం వల్ల నష్టపోయినట్టు అయ్యింది. ఉదాహరణకు క్రాస్ రోడ్స్ లో దేవి 70 ఎంఎం లాంటి పెద్ద థియేటర్ కళ్యాణం కమనీయంకు ఇచ్చారు. కట్ చేస్తే ఏ షోకి పది వేల గ్రాస్ రాలేదు. అంటే అద్దెకే ఎదురు కట్టాల్సిన పరిస్థితి

తర్వాత ఆదివారం సెకండ్ షో సమయానికి వాల్తేరు వీరయ్యకి ఇచ్చారు కానీ అప్పటికే లేట్ అయిపోయింది. దాదాపు అన్ని సెంటర్లలోనూ ఇదే సీన్ కనిపించింది. పైగా దిల్ రాజు వారసుడు ఉందని తెలిసి కూడా కళ్యాణం కమనీయంని దింపడం వల్ల అప్ కమింగ్ హీరో సంతోష్ శోభన్ ఖాతాలో మరో ఫ్లాప్ దక్కడం తప్ప ఇంకేం రాలేదు.

యువికి పోయేదేమీ లేదు. లాభమో నష్టమో ఈజీగా బయట పడుతుంది. కానీ దానికి పనిచేసివారెవరికి సక్సెస్ ఫుల్ మూవీలో భాగమయ్యామన్న ఆనందం లేకుండా పోయింది. ఆ మధ్య దసరా టైంలో స్వాతిముత్యం సైతం ఇదే అనుభవానికి లోనవ్వడం మర్చిపోగలమా