సామ్ -చై హిట్ మూవీ రీమేక్.. ఇరగదీస్తున్న కలెక్షన్లు

ఒక సూపర్ డూపర్ హిట్ సినిమాను మరో భాషలో రీమేక్ చేయటం కొత్తేం కాదు. తాజాగా తెలుగులో హిట్ సాధించి.. మంచి వసూళ్లు చేపట్టిన ఒక మూవీని తాజాగా మరాఠిలో రీమేక్ చేసి విడుదల చేయటం.. ఆ మూవీ భారీ వసూళ్లను చేపట్టటం ఆసక్తికరంగా మారింది. ఒరిజినల్ మూవీ కంటే తక్కువ బడ్జెట్ లో ఈ రీమేక్ మూవీ చేయటం ఒక ఎత్తు అయితే.. వసూళ్లు సైతం ఒరిజినల్ చిత్రానికి మించి వచ్చే అవకాశం ఉందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఆ చిత్రం మరేదో కాదు.. అప్పట్లో రియల్ జంటగా ఉన్న సమంత-నాగచైతన్యలు జంటగా నటించిన ‘మజిలీ’
మజిలీ చిత్రానికి దర్శకుడు, రచయిత శివ నిర్వాణ.

2019 ఏప్రిల్ లో విడుదలైన ఈ చిత్రాన్ని అప్పట్లో రూ.20 కోట్ల బడ్జెట్ తో రూపొందించారు. దాదాపుగా రూ.70 కోట్ల వరకు వసూళ్లు సాధించినట్లుగాచెబుతారు. దీన్ని మరాఠిలోకి రీమేక్ చేశారు. ఒరిజినల్ మూవీలో మాదిరే.. మరాఠి మూవీలోనూ రియల్ జంట అయిన రితేష్ దేశ్ ముఖ్.. జెనిలీయాలు తెర మీద జంటగా నటించారు. ఈ మూవీని మరాఠీలో ‘వేద్’గా విడుదల చేశారు. డిసెంబరు చివర్లో (డిసెంబరు 30) విడుదలైన ఈ మూవీ ఇప్పటికి రూ.44.92 కోట్ల వసూళ్లు రాబట్టి.. మరిన్నివసూళ్ల దిశగా పరుగులు తీస్తున్నట్లు చెబుతున్నారు.

వేద్ చిత్రానికి ఉన్న మరో ప్రత్యేకత ఏమంటే.. ఈ సినిమాతో బాలీవుడ్ నటుడుగా సుపరిచితమైన రితేశ్ దేశ్ ముఖ్ దర్శకత్వ బాధ్యతల్ని చేపట్టారు. నాగచైతన్య పాత్రను రితేశ్ పోషించగా.. సమంత నటించిన పాత్రను జెనీలియా నటించారు. కొత్త సంవత్సరం కానుకగా విడుదలైన ఈ చిత్రం రికార్డుకలెక్షన్లతో బాక్సాఫీస్ దుమ్ము రేపుతోంది.

మరాఠా బ్లాక్ బస్టర్ర మూవీ సైరాట్ చిత్రం రూ.110 కోట్లు సాధిస్తే.. ఆ తర్వాత భారీ కలెక్షన్లు సాధించిన చిత్రంగా వేద్ నిలుస్తుందని చెబుతున్నారు. ఈ చిత్రంలో పదేళ్ల గ్యాప్ తర్వాత జెనీలియా మరోసారి తెర మీద తళుక్కుమన్నారు.

ఈ సినిమాలో రితీశ్ లేకుంటే ఆ పాత్ర చేయటానికి మరికొంత సమయం పట్టేదని.. కానీ ఆయన ప్రోత్సాహంతో తాను ఆ సినిమాను మరింత సులువుగా చేసినట్లుగా జెనిలీయి చెబుతున్నారు. ఇందులో తనది ఇల్లాలి పాత్ర అని.. అందుకే.. చాలా సులువుగా చేయగలిగినట్లుగా పేర్కొన్నారు.