చిరు, బాలయ్య అభిమానుల్లో చిచ్చు పెట్టారే..

మెగాస్టార్ Chiranjeevi ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలకు సంబంధించి ఒక వీడియో నిన్న మొత్తం సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది. అది పట్టుకుని నందమూరి బాలకృష్ణ మీద చిరు పంచులేశాడంటూ ఆయన అభిమానులు.. టీడీపీ మద్దతుదారులు మెగాస్టార్ మీద పడిపోయారు. ఆయన్ని విపరీతంగా ట్రోల్ చేశారు. విమర్శించారు. ప్రతిగా చిరు అభిమానులు కూడా రెచ్చిపోయారు. ఈ రచ్చకు కారణమైన వీడియోలో చిరు వ్యాఖ్యల వెనుక నేపథ్యం తెలిశాక మాత్రం ఇదంతా Chiru, Balayya అభిమానుల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం అని స్పష్టంగా తెలిసిపోతోంది. ఈ వీడియో వ్యవహారం వెనుక అసలేం జరిగిందో చూద్దాం పదండి.

ఒక వీడియో ఇంటర్వ్యూలో ‘‘నా పేరు ప్రస్తావించారా లేదా.. మెగా అని ప్రస్తావించారా లేదా అంటే.. ప్రస్తావిస్తారు కానీ ఎన్నిసార్లు ప్రస్తావిస్తారు. మాట్లాడితే నేను మా నాన్నగారు నాన్నగారు అని పదిసార్లు చెప్పుకుని.. చరణ్ బాబు నా నాన్న చిరంజీవి, మానాన్న ఎంత గొప్ప అని పదిసార్లు చెప్పుకుంటే వినేవాళ్లకు విసుగుపుడుతుంది. ఆపయ్యా మీనాన్న మీనాన్న సుత్తి అని చరణ్‌ను తిడతారు’’ అని చిరు వ్యాఖ్యానించాడు.

బాలయ్య తరచుగా ‘‘మా నాన్న గారు’’ అంటూ ఎన్టీఆర్ గురించి చెబుతుంటాడు కాబట్టి.. చిరు కావాలనే బాలయ్యను టార్గెట్ చేశాడు అనేలా ఈ వీడియోను ప్రచారంలోకి తెచ్చారు. బాలయ్య ఫ్యాన్స్ చాలా గట్టిగానే చిరును టార్గెట్ చేశారు. ఈ వాదనలోకి మెగా అభిమానులు కూడా వచ్చారు.

వాస్తవానికి చిరు ఆ మాటలు మాట్లాడిన సందర్భం పూర్తి భిన్నం. ఈ మధ్య అల్లు ఫ్యామిలీ మెగా కుటుంబానికి దూరం అవుతున్నట్లు.. బన్నీ ‘మెగా’ బ్రాండును ఉద్దేశపూర్వంగా పక్కన పెడుతున్నట్లు కనిపిస్తుండడం గురించి ప్రశ్న అడగ్గా.. అల్లు అరవింద్ కుటుంబంతో తనకున్న అనుబంధం గురించి చెబుతూ.. అందరం వ్యక్తిగతంగా కలిసిమెలిసి ఉంటామని.. సినిమాల విషయానికి వచ్చేసరికి ఎవరి ఎదుగుదల వారిదని.. ‘మెగా’ అనో, తన పేరో అందరూ ప్రతిసారీ చెప్పాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానిస్తూ చిరు ఈ కామెంట్ చేశాడు.

అంతే తప్ప బాలయ్యను ఉద్దేశించి చిరు ఈ మాట అన్న సంకేతాలు పూర్తి వీడియో చూస్తే ఎక్కడా కనిపించవు. కానీ కొందరు రాజకీయ దురుద్దేశాలతో కావాలనే వీడియోను కట్ చేసి ఈ వీడియోను వైరల్ చేసి.. మెగా, నందమూరి అభిమానుల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.