వీరసింహారెడ్డి సూపర్ ఛాన్స్ కొట్టేశాడు

అనూహ్యంగా వారసుడు మూడు రోజులు వాయిదా పడటంతో థియేటర్ల పరంగా వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డిలకున్న అతి పెద్ద చిక్కు తొలగింది. వీటికి గౌరవమిచ్చే తాను నిర్ణయం మార్చుకున్నానని దిల్ రాజు చెప్పాడంతో 12నే రాబోతున్న బాలయ్య మూవీకి జరగబోయే మేలు అంతా ఇంతా కాదు. ఒకరోజు ముందే తెగింపు వస్తున్నప్పటికీ అజిత్ మార్కెట్ దృష్యా దీని మీద ట్రేడ్ సైతం భారీ ఆశలేం పెట్టుకోలేదు. మాస్ ఆడియన్స్ ఎలాగూ ఫస్ట్ ఛాయస్ గా చూడరు కాబట్టి 11 నుంచి ఇంకో ఇరవై నాలుగు గంటలు ఆగితే టాలీవుడ్ బిగ్గెస్ట్ స్టార్స్ సంక్రాంతి సినిమాలు చూడటం మొదలుపెట్టొచ్చు.

ఎలా చూసినా దీని వల్ల లాభపడేది వీరసింహారెడ్డినే. స్క్రీన్ కౌంట్ భారీగా ఉంటుంది. కావాల్సినన్ని థియేటర్లు దొరుకుతాయి. ఎగ్జిబిటర్ల సహకారం ఉంటుంది. హిట్టు టాక్ వచ్చిందా ఆపై కనీసం రెండు మూడు రోజులకు అడ్వాన్ లోనే ఫుల్ అయిపోయే పరిస్థితి తలెత్తుతుంది. వాల్తేరు వీరయ్యకి ఈ సౌలభ్యం ఉండదు. ముందు బాలయ్య ఆ తర్వాత దిల్ రాజు ఉంటారు కాబట్టి మధ్యలో సర్దుకుపోయే సూత్రాన్ని పాటించాల్సి ఉంటుంది. ఒకవేళ దీనికీ బ్లాక్ బస్టర్ టాక్ వస్తే అప్పుడు సమీకరణాలు మారతాయి. వారసుడు కౌంట్ అప్పటికే డిసైడ్ అయ్యుంటుంది కానీ చిరు బాలయ్య దానికన్నా ముందే గట్టిగా ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది.

ప్రాధమిక అంచనా ప్రకారం వీరసింహారెడ్డికి మొదటి రోజు ఇరవై నుంచి ముప్పై కోట్ల దాకా షేర్ ఈజీగా వస్తుందని డిస్ట్రిబ్యూటర్లు అంచనాలు వేస్తున్నారు. ఓవర్సీస్ బుకింగ్స్ బాగున్నాయి. ఇప్పుడు వారసుడు మార్పు వల్ల ఏపీ తెలంగాణలోనూ అదనంగా స్క్రీన్లు దొరుకుతాయి. సో ఈ అవకాశాన్ని మంచి టాక్ తో వాడుకుంటే చాలు కలెక్షన్లకే ఢోకా ఉండదు. ఇక్కడ చెప్పిన ఫిగర్ కన్నా ఎక్కువే వచ్చినా ఆశ్చర్యం లేదు. సినిమాలో ట్విస్టుల కన్నా ఎక్కువగా ఈ రిలీజుల వ్యవహారం జరుగుతోంది. మాస్ మొగుడు లిరికల్ వీడియోతో వీరసింహారెడ్డి ప్రమోషన్లు కీలక దశ దాటినట్టే. ఇంకో డెబ్బై ఆరు గంటల్లో ఫలితం తేలనుంది.