వెనక్కు తగ్గిన వారసుడు – ఎందుకంటే

గత రెండు రోజులుగా ప్రచారం లోకి వచ్సిన వార్తే నిజమయ్యింది. వారసుడు తెలుగు వెర్షన్ జనవరి 14కి వాయిదా వేస్తూ నిర్మాత దిల్ రాజు హైదరాబాద్ లో మీడియా ముఖంగా శ్రీకాంత్ తో కలిసి అధికారిక ప్రకటన చేశారు. నిజానికి రెండు భాషలకు సమాంతర రిలీజ్ ప్లాన్ చేశారు కానీ చిరంజీవి బాలకృష్ణ సినిమాలకు ప్రాధాన్యం ఇవ్వాలనే ఉద్దేశంతోనే తప్పుకున్నట్టు క్లారిటీ ఇచ్చారు. ఇది వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డిలకు ముందే చెప్పినట్టు థియేటర్ కౌంట్ పరంగా కనీసం ఒకటి రెండు రోజులకు అతి పెద్ద అడ్వాంటేజ్ కానుంది. ముఖ్యంగా బాలయ్య సినిమా పొందే లాభమే ఎక్కువనేది నో డౌట్.

గత రెండు నెలలుగా వివాదాలకు కేంద్ర బిందువుగా మారి దిల్ రాజుకి లేనిపోని తలనెప్పులు తెప్పించిన ఈ వ్యవహారం ఇలా ముగించడం మంచి పరిణామం. ఎందుకంటే ఏపీ తెలంగాణలో వారసుడు గ్రాండ్ రిలీజ్ కి కంకణం కట్టుకున్న ఈయన దానికి తగ్గట్టే అగ్రిమెంట్ లు చేసుకుంటూ వచ్చారు. లిస్టు బయటికి వచ్చేకొద్దీ సోషల్ మీడియాలో దీని మీద విపరీతమైన డిబేట్లు జరిగాయి. అసలు టాలీవుడ్ లో పెద్దగా మార్కెట్ లేని విజయ్ మూవీని బలవంతంగా రుద్ది వీరయ్య వీరసింహాలకు హ్యాండ్ ఇస్తారా అని ఫ్యాన్స్ గట్టిగానే నిలదీశారు. ప్రైవేట్ ఇంటర్వ్యూలు ఇచ్చిన దిల్ రాజు అందరి ముందు రాలేకపోయారు.

ఫైనల్ దీనికంతా చెక్ పడింది కానీ వరిసు మాత్రం యథావిధిగా 11నే వచ్చేస్తుంది. ఇక్కడో సమస్య ఉంది. తమిళ రివ్యూలు, పైరసీలో ప్రింట్లు వీటిని కట్టడి చేయడం అంత సులభం కాదు. ఆన్ లైన్లో రాకుండా సినిమాను ఆపగలిగినా పబ్లిక్ టాకులు సోషల్ మీడియా ఒపీనియన్లు చూస్తూ ఉండటం తప్ప ఏమీ చేయలేరు. వారసుడు చూడాలా వద్దా అనే జనాల మైండ్ సెట్ ని ఇవి ప్రభావితం చేయవని చెప్పడానికి లేదు. పైగా చిరు బాలయ్యలు కనక హిట్ టాక్ తెచ్చుకుంటే అప్పుడు వారసుడు బాగుందని వినిపించినా ఆడియన్స్ ప్రాధాన్యత ఆటోమేటిక్ గా స్ట్రెయిట్ చిత్రాల వైపే ఉంటుంది. వారసుడు ముందు పెద్ద సవాళ్ళే ఉన్నాయి.