టికెట్ రేట్ల వాయింపుకి సిద్ధం కావాల్సిందే

ఇంకో ఎనిమిది రోజుల్లో బాక్సాఫీస్ అతి పెద్ద పండగకు రంగం సిద్ధమయ్యింది. కేవలం మూడు రోజుల్లో నాలుగు పెద్ద సినిమాలు ఒక బడ్జెట్ మూవీ వస్తున్న నేపథ్యంలో థియేటర్లు నిండుగా కళకళలాడటం చూడబోతున్నాం. వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డిలకు సహజంగానే తెలుగు ప్రేక్షకులు మొగ్గు చూపిస్తున్నారు. అయితే బజ్ తో సంబంధం లేకుండా వారసుడుని దిల్ రాజు భారీ ఎత్తున్న ప్లాన్ చేస్తుండటంతో దీనికెలాంటి రెస్పాన్స్ వస్తుందోనని సోషల్ మీడియా జనాలు ఆసక్తి చూపిస్తున్నారు. టాక్ ఏ మాత్రం కొంచెం అటుఇటు అయినా అది చిరంజీవి బాలకృష్ణలకు అనుకూలంగా మారుతుందని అంచనా వేస్తున్నారు.

ఇదంతా ఓకే కానీ సగటు ప్రేక్షకుడికి టికెట్ రేట్ల శరాఘాతం మరోసారి తగలక తప్పేలా లేదు. భారీ చిత్రాలు కావడంతో తెలంగాణలో మల్టీ ప్లెక్సులతో పాటు సింగల్ స్క్రీన్లు సైతం పెంపుకి వెళ్లిపోతాయి. అనుమతి అవసరం లేకుండా గరిష్టంగా 295 రూపాయల దాకా వసూలు చేసే సౌలభ్యం ఉంది కాబట్టి ఇది ఫిక్స్. అంతకన్నా ఎక్కువ కావాలంటే మరో పాతిక నుంచి యాభై దాకా ప్రభుత్వానికి అప్పీల్ చేసుకోవాలి. ఆ అవసరం పడకపోవచ్చు. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఖచ్చితంగా పర్మిషన్ లేనిదే హైక్ రాదు. ఆర్ఆర్ఆర్, ఆచార్య, రాధే శ్యామ్ వగైరాలకు ఇచ్చారు కాబట్టి ఇప్పుడు నో చెప్పే ఛాన్స్ ఉండదు.

ఇక బెనిఫిట్ షోలు, ప్రీమియర్ల రేట్లు, అభిమాన సంఘాల తరఫున పెట్టే కటవుట్లు వగైరా సదరు ఫ్యాన్స్ కి తడిసి మోపెడవ్వడం ఖాయం. మాములుగా కూకట్పల్లి ప్రాంతంలో వేసే స్పెషల్ షోలకు టికెట్ రెండు నుంచి మూడు వేల రూపాయల మధ్యలో ఉంటుంది. ఈసారి మెగా నందమూరి సినిమాలు ఊర మాస్ కాబట్టి ఎగబడే జనం ఎక్కువగా ఉంటారు. వీటిని పక్కనపెడితే పండగతో మొదలుపెట్టి పదిరోజుల దాకా పెంపుని తట్టుకుంటేనే ఫ్యామిలీ ఆడియన్స్ సినిమాలు చూడగలరు. బ్లాక్ బస్టర్ టాక్ వస్తే అదేమీ లెక్క చేయరు కానీ వారసుడు, తెగింపు, కళ్యాణం కమనీయంలకు ఈ స్ట్రాటజీ అంతగా వర్కౌట్ కాకపోవచ్చు.