బడా సినిమాల మధ్య నలిగిపోతాయా ?

ఈ సంక్రాంతికి నాలుగు బడా సినిమాల మధ్య ఓ రెండు చిన్న సినిమాలు థియేటర్స్ లోకి రాబోతున్న విషయం తెలిసిందే. అందులో ఒకటి సంతోష్ శోభన్ ‘కళ్యాణం కమనీయం’ కాగా మరొకటి ‘వివాహం’. సంతోష్ శోభన్ హీరోగా యూవీ క్రియేషన్స్ నిర్మించిన ‘కళ్యాణం కమనీయం’ సినిమా జనవరి 14 న థియేటర్స్ లోకి రానుంది. ఈ సినిమాతో అనిల్ కుమార్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఇక అదే రోజు రాహుల్ విజయ్ , శివానీ రాజశేఖర్ జంటగా తెరకెక్కిన వివాహం అనే యూత్ ఫుల్ మూవీ కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది.

అయితే బడా సినిమాల మధ్య సంక్రాంతి బరిలో నిలిచిన ఈ చిన్న సినిమాలకు మినిమం బజ్ లేదు. ప్రమోషన్స్ కూడా అంతంత మాత్రంగానే చేస్తున్నారు. సోషల్ మీడియాలో సాంగ్స్ , పోస్టర్స్ రిలీజ్ తప్ప మరో పబ్లిసిటీ యాక్టివిటీ కనిపించడం లేదు. వివాహం అనేది మరీ చిన్న సినిమా పబ్లిసిటీకి పెద్ద బడ్జెట్ లేకపోవచ్చు., కానీ యూవీ సంస్థ నుండి వస్తున్న ‘కళ్యాణం కమనీయం’ కి కూడా సరైన పబ్లిసిటీ చేయకపోవడమే డౌట్ కొడుతుంది.

సంక్రాంతి పోటీలో ‘కళ్యాణం కమనీయం’ సినిమాకి ప్రేక్షకులు రావాలంటే అసలు అంతో ఇంతో ప్రమోషన్ కనిపించాలి. ఈ విషయం యూవీ నిర్మాతలకు తెలియని విషయం కాదు. అయినా ఎందుకో లైట్ తీసుకుంటున్నారు. నిర్మాతల వైఖరి చూస్తుంటే ఓటీటీ రిలీజ్ కి ముందు థియేటర్స్ లో ఏదో నామ మాత్రంగా వీటిని రిలీజ్ చేస్తున్నట్టు కనిపిస్తుంది.