మన్మథుడి సినిమాలో అల్లరోడు

హీరోగా కొన్నేళ్ల పాటు విజయం లేక బాగా ఇబ్బంది పడ్డాడు అల్లరి నరేష్. అలాంటి టైంలోనే అతను స్పెషల్ రోల్ చేసిన ‘మహర్షి’ సినిమా అతడికి ఉపశమనాన్ని అందించింది. అందులో అతడి పాత్రకు మంచి స్పందన వచ్చింది. మామూలుగా కామెడీనే చేసే నరేష్ అందులో సీరియస్ రోల్‌లో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత ‘నాంది’లోనూ సీరియస్ రోల్ చేసి హీరోగా హిట్ కొట్టాడు.

ఇటీవల ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ సినిమా మాత్రం అతడికి నిరాశను మిగిల్చింది. హీరోగా ‘నాంది’ దర్శకుడు విజయ్ కనకమేడలతో మరో సినిమాను లైన్లో పెట్టిన నరేష్.. మళ్లీ ఓ సినిమాలో ప్రత్యేక పాత్ర చేసేందుకు రెడీ అవుతుండడం విశేషం. ఈసారి అతను సీనియర్ హీరో అక్కినేని నాగార్జునతో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడట. ఈ వెండితెర మన్మథుడు హీరోగా యువ రచయిత ప్రసన్న కుమార్ బెజవాడ ఓ సినిమా తీయబోతున్న సంగతి తెలిసిందే.

ఈ చిత్రంలో అల్లరి నరేష్ కథలో కీలకమైన ఓ ప్రత్యేక పాత్ర చేయనున్నాడట. నాగార్జునతో నరేష్ చేస్తున్న తొలి చిత్రం ఇదే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ కాంబినేషన్ ఆసక్తి రేకెత్తించేదే. మరి ఈ కాంబినేషన్ ప్రేక్షకులను ఎలా అలరిస్తుందో చూడాలి. కొన్నేళ్లుగా సరైన విజయాలు లేని నాగార్జునకు ఈ ఏడాది ‘ఘోస్ట్’ పెద్ద షాకిచ్చింది. కచ్చితంగా హిట్టు కొట్టాల్సిన స్థితిలో సినిమా చూపిస్త మావ, నేను లోకల్, హలో గురూ ప్రేమకోసమే, ధమాకా చిత్రాలతో వరుసగా హిట్లు కొట్టి స్టార్ రైటర్ స్టేటస్ అందుకున్న ప్రసన్న కుమార్ బెజవాడతో జట్టు కడుతున్నాడు నాగ్. దర్శకుడిగా అతడికి ఇదే తొలి చిత్రం.

‘ధమాకా’ లాంటి పెద్ద హిట్ తర్వాత ప్రసన్నకుమార్ మీద నాగ్‌కు మరింత గురి కుదిరే ఉంటుంది. ఈ చిత్రాన్ని సొంత బేనర్లోనే నాగ్ నిర్మిస్తాడని అంటున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన రానుంది. నాగార్జున ఇందులో ద్విపాత్రాభినయం చేయనున్నట్లు సమాచారం.