దిల్ రాజును వదలని అజిత్ ఫ్యాన్స్

టాలీవుడ్లో చాలామంది అగ్ర హీరోలతో సినిమాలు నిర్మించిన స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు.. ఇప్పుడు కోలీవుడ్ టాప్ హీరో విజయ్ సినిమాతో తమిళ ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ చిత్రమే.. వారిసు/వారసుడు. సంక్రాంతికి విడుదలవుతున్న ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల కేటాయింపు విషయంలో పెద్ద వివాదం తలెత్తిన సంగతి తెలిసిందే. దీనికి కొనసాగింపుగా దిల్ రాజు చేసిన ఒక కామెంట్ దుమారం రేపింది.

తమిళంలో విజయే నంబర్ వన్ హీరో అని.. సంక్రాంతికి పోటీగా రిలీజవుతున్న అజిత్ మూవీ ‘తునివు’ కంటే దీనికి ఎక్కువ థియేటర్లు ఇవ్వాలని అడుగుతానని ఆయన ఓ తెలుగు న్యూస్ ఛానెల్ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు తమిళనాట దుమారం రేపాయి. విజయ్‌ను నంబర్ వన్ హీరో అనడం, అజిత్ సినిమా కంటే విజయ్ చిత్రానికి ఎక్కువ థియేటర్లు ఇవ్వాలనడం అజిత్ ఫ్యాన్స్‌కు అస్సలు నచ్చలేదు. అప్పట్నుంచి వాళ్లు రాజును టార్గెట్ చేస్తున్నారు.

ఐతే రాజు ఏదో ఫ్లోలో ఇలా మాట్లాడేశారేమో, ఈ వ్యాఖ్యలను సరిదిద్దుకుంటారేమో అనుకుంటే.. తాజాగా చెన్నైలో జరిగిన ‘వారిసు’ ఆడియో వేడుకలో మళ్లీ అజిత్ అభిమానులను ఉడికించేలా మాట్లాడాడు రాజు. ‘వారిసు’కు ఎలివేషన్ ఇచ్చే క్రమంలో ఈ సంక్రాంతి మాదే అని రాజు స్టేట్మెంట్ ఇవ్వడం అజిత్ ఫ్యాన్స్‌కు రుచించట్లేదు.

ఓవైపు ‘తునివు’ డైరెక్టర్ వినోద్ ఆ సినిమా ప్రమోషన్లలో మాట్లాడుతూ.. సంక్రాంతికి తునివుతో పాటు వారిసు కూడా బాగా ఆడాలని వ్యాఖ్యానించాడు. కానీ రాజుతో పాటు వంశీ పైడిపల్లి ‘వారిసు’ ఆడియో వేడుకలో ‘‘ఈ సంక్రాంతి మాదే’’ అనే స్టేట్మెంట్ ఇవ్వడాన్ని తప్పుబడుతున్నారు. ఈ స్టేట్మెంట్ల తర్వాత అజిత్ అభిమానులు మరోసారి రాజును టార్గెట్ చేస్తున్నారు. ఉద్దేశపూర్వకంగా అజిత్ అభిమానులను రెచ్చగొడుతున్నాడంటూ రాజును విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. అభిమానుల మధ్య చిచ్చు పెడుతున్నాడంటూ ఆయన మీద ఆరోపణలు గుప్పిస్తున్నారు.