కార్తికేయ‌-2 ఆడింద‌ని క‌థ మార్చ‌లేదు

18 పేజెస్.. యువ కథానాయకుడు నిఖిల్ సిద్ధార్థ నుంచి రాబోతున్న కొత్త చిత్రం. క్రిస్మస్ కానుకగా ఈ నెల గురువారమే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ‘కార్తికేయ-2’ లాంటి భారీ విజయం తర్వాత నిఖిల్ నుంచి వస్తున్న సినిమా కావడం.. ‘కార్తికేయ-2’ హీరోయిన్ అనుపమ పరమేశ్వరనే ఇందులోనూ కథానాయికగా నటించడం.. ‘కుమారి 21 ఎఫ్’ తర్వాత సుకుమార్ కథతో, ఆయన శిష్యుడు పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో దీనిపై అంచనాలు బాగానే ఉన్నాయి.

ఐతే ‘కార్తికేయ-2’తో పాన్ ఇండియా స్థాయిలో నిఖిల్‌కు స్టార్ ఇమేజ్ రావడంతో ఆ తర్వాత నిఖిల్ ఒక ప్రేమకథ చేస్తే ప్రేక్షకులు అంగీకరిస్తారా అన్న సందేహాలున్నాయి. కొన్నిసార్లు హీరో ఒక పెద్ద సక్సెస్ అందుకున్నాక ఇమేజ్‌ను మ్యాచ్ చేయలేక కొన్ని సినిమాలు బోల్తా కొట్టిన అనుభవాలున్నాయి.

‘18 పేజెస్’కు సంబంధించి ఎప్పుడో చిత్రీకరణ పూర్తయినా.. ఇటీవల మళ్లీ కొన్ని సన్నివేశాలు చిత్రీకరించడంతో మారిన నిఖిల్ ఇమేజ్‌కు తగ్గట్లు కథను మార్చారేమో అన్న సందేహాలు కూడా కలిగాయి. కానీ అలాంటిదేమీ జరగలేదని దర్శకుడు ప్రతాప్ స్పష్టం చేశాడు. ‘‘కార్తికేయ-2 పెద్ద సక్సెస్ అయింది కాబట్టి ‘18’ పేజెస్‌లో కొన్ని మార్పులు జరిగి తీరాలి. కానీ నిఖిల్ మాత్రం తనకు పాన్ ఇండియా ఇమేజ్ వచ్చింది కాబట్టి కథను మార్చాల్సిన అవసరం లేదని స్పష్టంగా చెప్పాడు. మూల కథలో మేం ఎలాంటి మార్పులు చేయలేదు. కానీ చిన్న చిన్న అడిషన్స్ జరిగాయి’’ అని చెప్పాడు.

ఈ సినిమాకు క్లైమాక్స్ ప్రాణం అని.. అది ప్రేక్షకులపై బలమైన ముద్ర వేస్తుందని.. సినిమా చాన్నాళ్ల పాటు గుర్తుండిపోతుందని ప్రతాప్ ధీమా వ్యక్తం చేశాడు. ‘కుమారి 21 ఎఫ్’ తర్వాత కెరీర్లో తనకు చాలా గ్యాప్ వచ్చిందని, ఇక స్పీడు పెంచుతానని, తన తర్వాతి చిత్రం మైత్రీ మూవీ మేకర్స్‌లో ఉంటుందని ప్రతాప్ ప్రకటించాడు.