మహేష్-నమ్రతలకు గొడవంటూ వచ్చిందంటే..

టాలీవుడ్లో బెస్ట్ సెలబ్రెటీ కపుల్ లిస్టు తీస్తే.. అందులో ముందు వరుసలో ఉండే పేర్లు మహేష్ బాబు-నమ్రత శిరోద్కర్. మహేష్ బాలీవుడ్ హీరోయిన్ అయిన నమ్రతను ప్రేమించి పెళ్లి చేసుకున్నపుడు చాలామంది ఇక్కడ అమ్మాయిలు లేనట్లు ఉత్తరాది అమ్మాయిని చేసుకున్నాడేంటి అనుకున్నారు.

కానీ గత రెండు దశాబ్దాలుగా మహేష్‌కు అన్ని రకాలుగా నమ్రత ఇస్తున్న సపోర్ట్.. మహేష్‌ను ఒక బ్రాండ్‌గా మార్చిన వైనం చూసి ఆయనకు ఆమే కరెక్ట్ అని అభిప్రాయపడుతున్నారు. అందుకే సెలబ్రెటీ కపుల్స్ లిస్టులో వారి పేర్లను పైన నిలబెడుతున్నారు. పలు సందర్భాల్లో మహేష్ తనకు నమ్రత ఇచ్చే సపోర్ట్ గురించి మాట్లాడాడు.

ఐతే మీడియాకు కొంచెం దూరంగా ఉండే నమ్రత.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మహేష్‌తో ప్రేమ, పెళ్లి, ఆ తర్వాతి జీవితం గురించి ఆసక్తికర విశేషాలు పంచుకుంది. పెళ్లి తర్వాత తాను నటించకపోవడం గురించి కూడా స్పందించింది.

సినిమాల్లోకి రాకముందు తాను మోడలింగ్‌ చేశానని.. అది బోర్ కొట్టాక సినిమా పరిశ్రమ వైపు వచ్చానని నమ్రత చెప్పింది. సినిమాలను ఆస్వాదిస్తూ సాగుతున్న టైంలో మహేష్ పరిచయమయ్యాడని… తర్వాత ఇద్దరం పెళ్లి చేసుకున్నామని.. తనకు కాబోయే భార్య ఎలా ఉండాలో మహేష్‌కు స్పష్టమైన ఆలోచన ఉందని నమ్రత తెలిపింది.

ఆ ఆలోచనకు తగ్గట్లే తాను సినిమాలకు దూరం అయ్యానని.. పెళ్లి తర్వాత కూడా తనకు అవకాశాలు వచ్చినా సినిమాల్లో నటించాలనే ఉద్దేశం తనకు లేకపోవడం వల్ల వాటిని అంగీకరించలేదని నమ్రత స్పష్టం చేసింది. బేసిగ్గా తనకు మహేష్‌కు గొడవలు రావని.. కానీ పిల్లల విషయంలో మాత్రం అప్పుడప్పుడూ వాదోపవాదాలు జరుగుతుంటాయని నమ్రత వెల్లడించింది.

పిల్లలు ఏది కావాలన్నా మహేష్‌నే అడుగుతుంటారని.. ఆయన కాదనరని, తనను అడిగితే నో అంటానని.. అలా తమ మధ్య సరదాగా వాదోపవాదాలు జరుగుతుంటాయని నమ్రత తెలిపింది. మహేష్ నటించిన చిత్రాలన్నింట్లో తనకు ‘పోకిరి’ చాలా ఇష్టమని.. అందులో మహేష్ చెప్పే పంచ్ డైలాగులను బాగా ఆస్వాదిస్తానని నమ్రత చెప్పింది.