మీడియా వాళ్లు గెలికింది చాలు-దిల్ రాజు

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు పేరు ఇప్పుడు ఇటు టాలీవుడ్లో, అటు కోలీవుడ్లో చర్చ‌నీయాంశం అవుతోంది. వార‌సుడు సినిమాకు థియేట‌ర్ల కేటాయింపు విష‌య‌మై ఆయ‌న తాజాగా చేసిన వ్యాఖ్య‌లు త‌మిళ‌నాట దుమారం రేపాయి. త‌మిళంలో విజ‌య్ నంబ‌ర్ వ‌న్ హీరో అని, కాబ‌ట్టి సంక్రాంతికి రిలీజ‌వుతున్న అజిత్ మూవీ కంటే వారిసుకి ఎక్కువ థియేట‌ర్లు ఇవ్వాల‌ని ఆయ‌న ఓ ఇంట‌ర్వ్యూలో చేసిన వ్యాఖ్య‌లపై కోలీవుడ్లో పెద్ద చ‌ర్చ న‌డుస్తోంది.

ఈ ఇంట‌ర్వ్యూ బ‌య‌టికి వ‌చ్చిన ఒక్క రోజులోపే త‌న ప్రొడ‌క్ష‌న్లో క‌మెడియ‌న్ వేణు రూపొందించిన బ‌ల‌గం సినిమాకు సంబంధించిన ప్ర‌మోష‌న‌ల్ ఈవెంట్లో రాజు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా మీడియా వాళ్లు రాజు తాజా వ్యాఖ్య‌ల‌పై త‌లెత్తిన వివాదం గురించి ఆయ‌న్ని అడిగారు.

దీనికి ఆయ‌న బ‌దులిస్తూ.. మీరు మీడియా వాళ్ళు ఎదో ఒకటి గెలుకుతుంటారు..ఇప్పుడు గెలక్కండి. ఆల్రెడీగెలికింది చాలు.. ఇప్పుడు బ‌ల‌గం సినిమా గురించి మాత్రమే మాట్లాడుదాం అంటూ స‌మాధానం దాట‌వేశారు దిల్ రాజు.

కాగా ఈవెంట్ చివ‌ర్లో రాజు స్వ‌యంగా ఈ టాపిక్ మీద మాట్లాడుతూ.. త‌న ఇంట‌ర్వ్యూకు సంబంధించి 20 సెక‌న్ల వీడియోను మాత్ర‌మే స‌ర్క్యులేట్ చేసి దాని మీద కాంట్ర‌వ‌ర్శీ క్రియేట్ చేసే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని అన్నారు. ఆ 20 సెకన్ల‌కు ముందు, వెనుక తాను ఏం మాట్లాడానో చూడాల‌ని.. అప్పుడు అస‌లు విష‌యం అర్థ‌మ‌వుతుంద‌ని.. తాను ఎప్పుడూ కావాల‌ని వివాదాలు క్రియేట్ చేసే వ్య‌క్తిని కాద‌ని.. ఎవ‌రినీ త‌క్కువ చేసి మాట్లాడ‌న‌ని.. ఇండ‌స్ట్రీ బాగుండాల‌ని, అన్ని సినిమాలు బాగా ఆడాల‌ని కోరుకుంటాన‌ని దిల్ రాజు వివ‌రించారు. త‌న వ్యాఖ్య‌ల‌పై త‌మిళ‌నాట త‌లెత్తిన వివాదం గురించి మాట్లాడుతూ.. తాను అక్క‌డి వారితో ట‌చ్‌లో ఉన్న‌ట్లు చెప్పారు.