ఆడుతూ పాడుతూ 200 కోట్లు

అసలే బాలీవుడ్ స్లంప్ లో ఉంది. ఆడియన్స్ థియేటర్లకు రావడం లేదు. ఆర్ఆర్ఆర్, కెజిఎఫ్, కార్తికేయ 2లు చూసిన కళ్ళతో సగటు యావరేజ్ హిందీ కంటెంట్ ని ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇలాంటి పరిస్థితిలో ఒక రీమేక్ అది కూడా మళయాలం తెలుగు వెర్షన్లు అమెజాన్ ప్రైమ్ లో సబ్ టైటిల్స్ తో సహా అందుబాటులో ఉండగా ఎవరు చూస్తారు. ఇలాంటి బోలెడు అనుమానాల మధ్య నవంబర్లో రిలీజైన అజయ్ దేవగన్ దృశ్యం 2 నెల తిరక్కుండానే ఆడుతూ పాడుతూ 200 కోట్ల మార్కుని దాటేసింది, కొన్ని ఏరియాల్లో ఏకంగా బ్రహ్మాస్త్ర పార్ట్ 1 శివని క్రాస్ చేసి ఇంకా స్ట్రాంగ్ గా దూసుకుపోతోంది. అవతార్ 2 వచ్చే దాకా దీనిదే రాజ్యం.

నిజంగా ఈ ఫలితం అనూహ్యం. ఎందుకంటే దృశ్యం 2 ఈ స్థాయిలో పబ్లిక్ కి రీచ్ అవుతుందని ఊహించలేదు. ది కాశ్మీర్ ఫైల్స్, భూల్ భులాయ్యా 2, బ్రహ్మాస్త్ర, గంగూబాయ్ కటియావాడిల సరసన నిలుస్తుందనే అంచనా ఎవరికీ లేదు. కానీ అజయ్ దేవగన్ సుడి బాగుంది. కెరీర్ లో మూడో సారి డబుల్ హండ్రెడ్ మార్కు అందుకున్నాడు. ఇంతకు ముందు గోల్ మాల్ అగైన్, తానాజీలు మాత్రం రెండు వందల కోట్లను దాటాయి. అంతకు ముందు ఆ తర్వాత లేవు. ఇప్పుడీ ఫ్యామిలీ క్రైమ్ థ్రిల్లర్ తో దాన్ని సాధించడం చిన్న విషయం కాదు. ఫైనల్ రన్ కు దగ్గరలో నాలుగో వారంలోనూ అయిదు కోట్ల దాకా రావడం గొప్పే.

మొత్తానికి మోహన్ లాల్, మన వెంకటేష్ లు ఏం మిస్ చేసుకున్నారో దృశ్యం 2 ఋజువు చేస్తోంది. ఒకవేళ వీళ్లూ బిగ్ స్క్రీన్ కు వెళ్లుంటే మంచి ఫలితం దక్కేదేమో. నిన్న సురేష్ బాబు మాటల్లోనూ ఆ అర్థం ధ్వనించింది. కరోనా కారణమే అయినప్పటికీ ఇంకొంత కాలం ఆగి ఉంటే ప్రేక్షకుల అండ దక్కేదేమో. ఇప్పుడు నారప్పని రిలీజ్ చేస్తున్నట్టు భవిష్యత్తులో ఎప్పుడైనా దృశ్యం 2ని ప్లాన్ చేయొచ్చేమో కానీ ఆల్రెడీ చూసేసిన సినిమాకు ఫ్యాన్స్ తప్ప సాధారణ ప్రేక్షకులు పెద్దగా రారు. అజయ్ ఇచ్చిన కిక్ తో క్రిస్మస్ కి రాబోతున్న రణ్వీర్ సింగ్ సర్కస్ మీద ట్రేడ్ భారీ నమ్మకం పెట్టుకుంది. అదేం చేస్తుందో చూడాలి.