శేష్‌తో కన్నీళ్లు పెట్టించేసిన మహేష్


అడివి శేష్ ఇప్పుడు మామూలు ఉత్సాహంలో లేడు. మంచి కంటెంట్ ఉన్న చిత్రాలతో వరుసగా హిట్లు కొడుతున్న అతడికి.. ‘హిట్-2’ మరో ఘనవిజయాన్ని అందించేలా కనిపిస్తోంది. ఈ శుక్రవారం మంచి అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది. వర్డ్ ఆఫ్ మౌత్, సోషల్ మీడియా పబ్లిసిటీ కూడా కూడా బాగా ప్లస్ అవుతున్నట్లు కనిపిస్తోంది. తొలి రోజు ఈ చిత్రం రూ.11 కోట్లకు పైగా వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్ట్ చేయడం విశేషం. శేష్ కెరీర్లో ‘హిట్-2’ తెలుగు వరకు బిగ్గెస్ట్ హిట్‌‌గా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది.

‘హిట్-2’ను త్వరలోనే హిందీ, ఇతర భాషల్లోనూ రిలీజ్ చేయబోతున్నారు. అక్కడా సక్సెస్ అయితే ‘మేజర్’ కలెక్షన్లను కూడా దాటేస్తుందేమో. ‘హిట్-2’కు సూపర్ రెస్పాన్స్ నేపథ్యంలో సోషల్ మీడియాలో అభిమానులతో చిట్ చాట్ నిర్వహించాడు శేష్.

ఈ సందర్భంగా ‘హిట్-2’‌ సక్సెస్ గురించి మహేష్ బాబు తనతో మాట్లాడిన సంగతి వెల్లడించాడు శేష్. ‘‘రిలీజ్ రోజు ఉదయం మహేష్ గారు ఫోన్ చేసి చాలా సేపు మాట్లాడారు. నా విషయంలో చాలా ప్రౌడ్‌గా ఉన్నానని చెప్పారు. ఆ క్షణం నాకు కన్నీళ్లు వచ్చేశాయి. ఒక సోదరుడిగా నాకు ఎప్పటికీ తోడుగా ఉంటానని ఆయనకు మాటిచ్చా. ఆయనకు ‘హిట్-2’ చూపించాలని ఆశగా ఉన్నా’’ అని శేష్ తెలిపాడు. ‘హిట్’ తర్వాతి సినిమాలో మహేష్ బాబును హీరోగా పెట్టండని ఒక అభిమాని అనగా.. ఆయనకు ఈ సినిమా సూటవుతుందో లేదో ఆలోచించాలని చెప్పాడు శేష్.

‘హిట్-2’ సక్సెస్‌ను ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అని అడిగితే.. ‘‘నేను, నాని, విశ్వక్సేన్, శైలేష్ కలిసి ‘హట్‌వర్స్’లో తర్వాత ఏం చేయాలనే దాని గురించి మాట్లాడుకున్నాం. అలాగే టీం అంతా కలిసి డ్యాన్స్ చేశాం’ అన్నాడు శేష్. ‘హిట్-2’ను ఈ నెల చివర్లో హిందీలో రిలీజ్ చేద్దామనుకుంటున్నామని.. అక్కడ తనే డబ్బింగ్ కూడా చెప్పుకుంటానని.. ‘మేజర్’ సినిమా సక్సెస్ నేపథ్యంలో ఈ సినిమా కోసం అక్కడి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని అతనన్నాడు.