సంవత్సరం పాటు రాసిన ఆ కథ ఏంటో!?

ఎప్పటినుండో అదిగో ఇదిగో అంటున్న శేఖర్ కమ్ముల డైరక్షన్లో ధనుష్‌ సినిమా మొత్తానికి చాలా లేటుగా ఇప్పుడు పూజకు నోచుకుంది. అయితే నాగ చైతన్యతో తీసిన ‘లవ్ స్టోరి’ సినిమా అనుకున్నంతగా ఆడకపోవడంతో కమ్మలు కూడా కాస్త నిరాశచెందినట్లు తెలుస్తోందిలే. ఏదేమైనా కూడా ఇప్పుడు సంవత్సరంపాటు కష్టపడి అసలు హ్యాపీ డేస్ దర్శకుడు రాసిన కథ ఏంటో అంటూ టాలీవుడ్‌లో ఊహాగానాలు చాలానే వినిపిస్తున్నాయి.

నిజానికి శేఖర్ కమ్ముల గతంలో లీడర్ సినిమాకు ఒక సీక్వెల్ చేద్దామని అనుకున్నాడట. కాని అందుకు సురేష్‌ బాబు ఒప్పుకోలేదని అప్పట్లో టాక్. ఒక మంచి వ్యక్తి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్నికై, ఆ తరువాత అతి పెద్ద అవినీతిపరుడైతే ఎలా ఉంటుంది అనే కథతో కమ్ముల ముందుకొస్తే.. దానిని సురేష్ బాబు వద్దన్నారట. మరి ధనుష్‌‌తో ఇదే కథను తీస్తున్నాడేమో అనే సందేహం ఎప్పటినుండో ఉంది. కాని శేఖర్ మాత్రం.. అప్పట్లో ఒక ప్రీ-ఇండిపెండెన్స్ తాలూకు కథను ఒకటి రెడీ చేశాడు. మనకు స్వాతంత్ర్యం రాకముందు.. మద్రాసు ప్రావిడెన్స్‌లో ఆంధ్ర కలిసున్నప్పుడు.. అక్కడి తమిళబ్బాయ్‌కి, ఇక్కడి నుండి చదుకోవడానికి మద్రాసు వెళ్ళిన ఒక అమ్మాయికీ మధ్యన జరిగే ప్రేమకథగా ఒక స్టోరీ డెవలెప్ చేశాడు. ఇప్పుడు దానినే ధనుష్‌ హీరోగా మూడు బాషల్లో తీస్తున్నారని సన్నిహతులు చెబుతున్నారు.

ఏదేమైనా కూడా ఇప్పుడు శేఖర్ కమ్ముల కూడా ధనుష్‌ సినిమాతో ప్యాన్ ఇండియా రేస్‌లో జాయిన్ అయిపోతాడులే. ఇప్పటివరకు ఆయన తీసిన సినిమాలన్నీ తెలుగుకే పరిమితం అయిపోయాయ్. కొన్ని సినిమాల్లో బాగా లోకల్ ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి, వాటిని వేరే రాష్ట్రాల్లో ఆడించడం కూడా కష్టం. అందుకే కమ్ముల కూడా ఇప్పుడు పీరియడ్ కథను ఎంచుకున్నాడని అనుకోవచ్చు. త్వరలోనే ఈ కథపై మరిన్ని ఇతర డిటైల్స్ వస్తాయేమో చూద్దాం మరి.