త్రివిక్రమ్ సినిమాలో తొలిసారి..

క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్లకు పెట్టింది పేరు త్రివిక్రమ్ సినిమాలు. ఆయన సినిమాల్లో కమర్షియల్ హంగులు ఉంటాయే తప్ప.. యూత్‌ను ఆకర్షించడం కోసం ప్రత్యేకంగా మసాలాల్లాంటివి అద్దరు. బూతు డైలాగులు పెట్టడం.. హీరోయిన్లతో ఎక్స్‌పోజింగ్ చేయించడం.. ఐటెం సాంగ్స్‌ జోడించడం.. ఇలాంటి వాటికి త్రివిక్రమ్ దూరం అనే చెప్పాలి.

మిగతా టాలీవుడ్ టాప్ డైరెక్టర్లయిన రాజమౌళి, సుకుమార్, కొరటాల శివ, పూరి జగన్నాథ్, బోయపాటి శ్రీను.. వీళ్లంతా కూడా తమ సినిమాల్లో ఐటెం సాంగ్స్ పెట్టిన వాళ్లే. సుకుమార్ అయతే ప్రతి సినిమాలోనూ అది మస్ట్ అంటాడు. కానీ త్రివిక్రమ్ మాత్రం ఇప్పటిదాకా ఏ సినిమాలోనూ ఐటెం సాంగ్‌కి స్కోప్ ఇవ్వలేదు. కానీ తొలిసారి త్రివిక్రమ్ కూడా తనకు తాను గీసుకున్న హద్దుల నుంచి బయటికి వస్తున్నట్లు సమాచారం. మహేష్ బాబుతో ఆయన చేయబోయే కొత్త సినిమాలో ఐటెం సాంగ్ ఉంటుందన్నది ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్.

పూజా హెగ్డే, శ్రీలీల కథానాయికలుగా నటించనున్న మహేష్-త్రివిక్రమ్ కొత్త సినిమాలో ఒక స్పెషల్ సాంగ్‌ ఉంటుందట. ఆ పాటలో రష్మిక మందన్నా తళుక్కుమనే అవకాశం ఉందని అంటున్నారు. సుకుమార్ సినిమాల్లో మాదిరి హైడోస్ గ్లామర్ ట్రీట్, కొంటెతనంతో కూడిన సాహిత్యం ఉండకపోవచ్చు కానీ.. కొంచెం చమత్కారంగా ఉండేలా ఈ పాటను తీర్చిదిద్దనున్నట్లు సమాచారం. తన ఆస్థాన నిర్మాణ సంస్త అయిన హారిక హాసిని క్రియేషన్స్‌తో త్రివిక్రమ్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.

డిసెంబరు రెండో వారంలో చిత్రీకరణ మొదలవుతుందని సమాచారం. ఇంతకుముందు అనుకున్న యాక్షన్‌ కథ విషయంలో ఏకాభిప్రాయం కుదరరకపోవడంతో తన స్టయిల్లో ఫ్యామిలీ ఎంటర్టైనర్ తీయడానికే త్రివిక్రమ్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. కథను పూర్తిగా మార్చి కొత్త ఆకర్షణలు జోడించి స్క్రిప్టు లాక్ చేశాడు మాటల మాంత్రికుడు. ఈ చిత్రానికి తమన్ సంగీతం సమకూర్చనున్నాడు. వచ్చే ఏడాది ఆగస్టు 11కు ఈ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.