సమంత పై గాలి వార్తలు

నెల కిందట తన అనారోగ్యం గురించి సమంత తొలిసారి వెల్లడించినపుడు సామాన్య అభిమానులే కాదు.. సెలబ్రెటీలు సైతం కదిలిపోయారు. మయోసైటిస్ అనే వ్యాధితో సమంత బాధపడుతున్నట్లు తెలిసి దాన్నుంచి త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. ఈ వ్యాధి మరీ తీవ్రమైంది కాదు. అలా అని తేలిగ్గా తీసుకునేది కూడా కాదు. జాగ్రత్తగా చికిత్స తీసుకుంటే కొంత కాలానికి నయమవుతుందని తెలిసి సమంత ఎలాగైనా దీన్నుంచి బయటికి రావాలని కోరుకున్నారు.

కొన్ని రోజుల పాటు ఆసుపత్రిలో ఉండి ఇంటికి చేరుకున్న సామ్.. వైద్యుల పర్యవేక్షణంలో మెడికేషన్ కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఐతే ఉన్నట్లుండి ఆమె పరిస్థితి కొంచెం ఇబ్బందికరంగా తయారైందని, దీంతో అత్యవసరంగా ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించాల్సి వచ్చిందని తాజాగా మీడియాలో ఓ ప్రచారం మొదలైంది. దీంతో అభిమానులు ఆందోళనకు గురయ్యారు.

ఐతే ఈ ప్రచారంపై సమంత టీం వెంటనే స్పందించింది. ఈ ప్రచారాన్ని ఖండించింది. ప్రస్తుతం సమంత ఇంట్లోనే ఉందని.. ఆమె ఆరోగ్యం కూడా బాగానే ఉందని సమంత మేనేజర్ స్పష్టం చేశాడు. దీంతో అభిమానుల్లో ఆందోళన తగ్గింది. ఐతే సమంతకు కొన్ని నెలల పాటు మెడికేషన్ అవసరమని.. క్లోజ్ మానిటరింగ్‌లో ఆమె ఉండాల్సిందే అని.. అంత వరకు ఆమె సినిమాలకు దూరంగానే ఉండబోతోందని తెలుస్తోంది. ఇటీవలే సమంత నటించిన ‘యశోద’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఈ సినిమాను సమంత దగ్గరుండి ప్రమోట్ చేసే పరిస్థితి లేకపోయింది. అయినా సరే.. సుమతో ఒక కామన్ వీడియో ఇంటర్వ్యూ చేసి మీడియాకు రిలీజ్ చేసింది సామ్. దానికి మంచి స్పందనే వచ్చింది. ఆ వీడియోలో సామ్ బలహీనంగా కనిపించడం అభిమానులను బాధించింది. డివైడ్ టాక్ తెచ్చుకుని కూడా ‘యశోద’ ఉన్నంతలో మంచి వసూళ్లే సాధించి సమంత స్టార్ పవర్‌ను తెలియజేసింది. అనారోగ్యం నుంచి కోలుకున్నాక సామ్ ‘ఖుషి’ సినిమా షూటింగ్‌లో పాల్గొంటుంది.