ఆదిపురుష్ దర్శకుని నిలదీస్తున్నారు

ఇంతన్నాడే అంతన్నాడే గంగరాజు, అయినాక ఒగ్గేసినాడే అంటూ పాత పాట ఒకటుంది. అంటే ఏదో బిల్డప్ ఇచ్చి చివరికి ఉసూరుమనిపించే వాళ్ళ గురించి ఉద్దేశించి దీన్ని పెద్దలు చెప్పారు. ఇప్పుడు ఆదిపురుష్ దర్శకుడు ఓం రౌత్ మీద ఇలాంటి కామెంట్లే వచ్చి పడుతున్నాయి. తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో రూపొందుతున్న హనుమాన్ టీజర్ చూశాక ఇవి మరింత ఎక్కువయ్యాయి. పట్టుమని పది కోట్ల బడ్జెట్ లేని మీడియం సినిమాలో ఇంతేసి క్వాలిటీ విజువల్ ఎఫెక్ట్స్ ని పెట్టగలిగినప్పుడు అయిదు వందల కోట్లని బాకాలు ఊదుతున్న టి సిరీస్ ఇంకే రేంజ్ లో చూపించాలని నిలదీస్తున్నారు.

ఇలా అడగటంలో లాజిక్ ఉంది కానీ వాస్తవిక కోణంలో ఆలోచిస్తే ఆది పురుష్ లో ఉన్నది కేవలం విజువల్ ఎఫెక్ట్సో గ్రాఫిక్సో కాదు. మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ ఉపయోగించిన కష్టమైన సాంకేతికత. దీన్ని సరిగా హ్యాండిల్ చేయలేకపోవడం వల్లే రజనీకాంత్ విక్రమ సింహ ఘోరంగా దెబ్బ తీసింది. అవతార్ ప్రపంచవ్యాప్తంగా నీరాజనాలు అందుకుంది కూడా ఈ టెక్నాలజీ వల్లే. మరి ప్రశాంత్ వర్మ లాంటి అప్ కమింగ్ టాలెంట్, కొత్త నిర్మాణ సంస్థతోనే ఇంత అవుట్ ఫుట్ ఇవ్వగలిగినప్పుడు టి సిరీస్ లాంటి దిగ్గజాన్ని చేతిలో పెట్టుకుని ఇలా చేస్తావా అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ గట్టిగా ఆడుతున్నారు.

వీటికి ఓం రౌత్ స్పందిస్తాడనే గ్యారంటీ లేదు. విడుదల తేదీ వాయిదా పడ్డాక ఇతను సైలెంట్ అయిపోయాడు. పోస్ట్ ప్రొడక్షన్ మరో వంద కోట్లు అదనపు ఖర్చుతో సరిచేస్తున్నారని, టీజర్ కు వచ్చిన నెగటివ్ ఫీడ్ బ్యాక్ ని సీరియస్ గా తీసుకుని చాలా మార్పులు చేస్తున్నారని టాక్ ఉంది కానీ అవెంత వరకు నిజమో ట్రైలర్ వచ్చాక క్లారిటీ వస్తుంది. ఏది ఏమైనా కార్తికేయ 2, హనుమాన్, బింబిసార లాంటి చోటా మోటా మూవీసే ఇన్ని అద్భుతాలు చేయగలిగినప్పుడు ఆది పురుష్ ఇంకెంత చేయాలో అని అంచనాలు పెట్టుకోవడం తప్పేం కాదుగా. అయినా అయిదు వందల కోట్లని ఊదరగొట్టడం కాదు దాన్ని నమ్మేలా చూపించాలి మరి.