ఫిబ్రవరిలో ఏముందబ్బా?

తెలుగులో అనే కాదు.. ఇండియా మొత్తంలో కొత్త సినిమాల విడుదలకు ఏమాత్రం అనుకూలం కాని నెలగా ఫిబ్రవరిని చూసేవారు. జనవరిలో సంక్రాంతి సినిమాల సందడి తర్వాత ఒక్కసారిగా బాక్సాఫీస్ డల్లవుతుంటుంది. రిపబ్లిక్ డే వీకెండ్లో కాస్త సందడి ఉంటుంది. ఆ తర్వాత బాక్సాఫీస్‌కు గడ్డు పరిస్థితులు మొదలవుతాయి. సినిమాకు మహ రాజ పోషకులైన యువతలో చాలామంది ఈ టైంలో పరీక్షలతో బిజీగా ఉంటారు. కాలేజీ స్టూడెంట్స్ అంతా పరీక్షలకు సిద్ధమవుతుంటారు కాబట్టి సినిమాలకు వసూళ్లు ఉండవు.

ముఖ్యంగా ఫిబ్రవరి సగం నుంచి మార్చి మూడో వారం వరకు డ్రై రన్ అన్నట్లే. అందుకే ఆ టైంలో పేరున్న, పెద్ద సినిమాలు విడుదల చేయరు. చాలా వరకు చిన్నా చితకా సినిమాలకు క్లియరెన్స్ టైం లాగా ఉపయోగపడుతుంటుంది ఈ ఈ సీజన్. ఐతే కరోనా టైం నుంచి కథ మారింది. గత రెండేళ్లూ చదువులు సరిగా సాగలేదు. పరీక్షల సంగతి సరేసరి. దీంతో ఫిబ్రవరిలో గత రెండేళ్లూ పెద్ద సినిమాలు కూడా రిలీజయ్యాయి. బాక్సాఫీస్ దగ్గర సందడి కనిపించింది.

ఇప్పుడు కరోనా ప్రభావం లేదు. పరీక్షలు యధావిధిగా జరుగుతున్నాయి. అయినా సరే ఫిబ్రవరి మీద టాలీవుడ్ చాలా ఆశలే పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. ఆ నెలలో మ్యాడ్ రష్ చూడబోతున్నాం. నవంబరు-డిసెంబరు నెలల్లో రిలీజ్ కావాల్సిన సినిమాలను కూడా వాయిదా వేసి మరీ ఫిబ్రవరి విడుదలకు ఫిక్స్ చేయడం విశేషం. సమంత సినిమా ‘శాకుంతలం’తో పాటు ధనుష్ ద్విభాషా చిత్రం ‘సార్’ కూడా డిసెంబరు నుంచి ఫిబ్రవరికి వాయిదా పడ్డవే. వీటికి తోడు నందమూరి కళ్యాణ్ రామ్ సినిమా ‘అమిగోస్’ సైతం ఫిబ్రవరికే షెడ్యూల్ అయింది. అలాగే యంగ్ హీరో కిరణ్ అబ్బవరం సినిమా ‘వినరో భాగ్యము విష్ణు కథ’ను కూడా ఫిబ్రవరిలో రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.

సంక్రాంతికి అనుకుని మళ్లీ వాయిదా పడ్డ ‘ఏజెంట్’ సినిమా కూడా ఫిబ్రవరిలోనే ప్రేక్షకులను పలకరిస్తుందని అంటున్నారు. రాబోయే రోజుల్లో మరికొన్ని సినిమాలు ఫిబ్రవరి రేసులోకి వస్తే ఆశ్చర్యమేమీ లేదు. అంతగా ఫిబ్రవరిలో ఏముందని ఇలా పోటీ పడుతున్నారో అని ఇండస్ట్రీ జనాలే ఆశ్చర్యపోతున్నారు.