నువ్వే నువ్వే మళ్ళీ ఇంకోసారి

రీ రిలీజుల ట్రెండ్ ఊపందుకున్నాక ముందు పెద్ద హీరోల సినిమాలు తర్వాత మెల్లగా చిన్న స్టార్లవి కూడా క్యూ కట్టేస్తున్నాయి. గత మూడు నాలుగు నెలలుగా కొనసాగుతున్న ఈ పునఃవిడుదల పర్వం ఇప్పట్లో ఆగే సూచనలు కనిపించడం లేదు. కేవలం ఇరవై రోజుల గ్యాప్ లో రెబల్, బిల్లా, వర్షం లు ప్లాన్ చేశారంటేనే ప్రభాస్ ఇమేజ్ ని క్యాష్ చేసుకునేందుకు ఏ రేంజ్ లో తతంగం జరుగుతోందో అర్థం చేసుకోవచ్చు. మొదలుపెట్టిన క్రెడిట్ మాత్రం మహేష్ బాబు పోకిరికి దక్కుతుంది. దాని తర్వాత పీక్స్ కు తీసుకెళ్లిన ఘనత పవన్ జల్సాకు ఇవ్వాలి. బాలయ్య చెన్నకేశవరెడ్డి హవా కూడా చిన్నది కాదు.

ఇప్పుడు దర్శకుల వంతు వచ్చింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ పుట్టినరోజు నవంబర్ 7. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని అయిదో తేదీ నుంచి రెండు మూడు రోజుల పాటు ఆయన డైరెక్టరోయల్ డెబ్యూ నువ్వే నువ్వే రీ రిలీజ్ చేస్తున్నారు. ఆ మధ్య హైదరాబాద్ ఏఎంబి మాల్ లో కేవలం యూనిట్ సభ్యులు మాత్రమే కొందరు మీడియా ప్రతినిధులతో కలిసి స్పెషల్ ప్రీమియర్ చూశారు. దానికి వచ్చిన రెస్పాన్స్ చూశాక ఇది కామన్ ఆడియన్స్ కి సైతం అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో స్టేట్ వైడ్ థియేటర్లలో తీసుకొస్తున్నారు నిర్మాత స్రవంతి రవి కిషోర్.

మాటల మాంత్రికుడి కల్ట్ ఫ్యాన్స్ ఈ అవకాశాన్ని ఎలా మిస్ చేసుకుంటారు. నువ్వే నువ్వే సరిగ్గా 20 సంవత్సరాల క్రితం రిలీజయ్యింది. మరీ రికార్డులు బద్దలు కొట్టిన బ్లాక్ బస్టర్ కాదు కానీ చాలా కేంద్రాల్లో మంచి రన్ సంపాదించుకుంది. ఇది చూశాకే మహేష్ బాబు అతడు లాంటి హెవీ సబ్జెక్టు డీల్ చేయగలడన్న నమ్మకంతో త్రివిక్రమ్ కు అవకాశం ఇచ్చాడు. ముఖ్యంగా నువ్వే నువ్వేలో డైలాగ్ పంచులు ప్లస్ ఎమోషన్స్ చాలా బాగుంటాయి. సింపుల్ కామెడీ అయినా సరే నవ్వకుండా ఉండలేం. ఇక కోటి స్వరపరిచిన పాటల సంగతి సరేసరి. 2002లో పుట్టిన ఇప్పటి యూత్ దీన్ని బిగ్ స్క్రీన్ మీద ఇప్పుడు ఎంజాయ్ చేయొచ్చు.