మంటెత్తిపోతున్న ప్రభాస్ ఫ్యాన్స్

అబ్బే ఎంత పోటీ ఉన్నా మాది ప్యాన్ ఇండియా మూవీ కాబట్టి సంక్రాంతికి వచ్చే తీరుతుందన్న అభిమానుల ధీమాని బద్దలు కొడుతూ ఆది పురుష్ వాయిదా వార్త విపరీతంగా వైరల్ అవుతోంది. నిజానికి టి సిరీస్ సంస్థ ఇంకా అధికారికంగా ప్రకటించనే లేదు. కేవలం డిస్ట్రిబ్యూటర్ల నుంచి వచ్చిన సమాచారాన్ని తీసుకుని మీడియా దాన్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది. నిప్పు లేనిదే పొగరాదు. నిర్మాత చెప్పనిదే పంపిణీదారులు అలా ఎందుకంటారు. సో అఫీషియల్ కావడం జస్ట్ లాంఛనమే. కొత్త డేట్ మార్చ్ లో వచ్చే శ్రీరామనవమిని టార్గెట్ చేసుకుని లాక్ చేస్తారనే లీక్ కూడా చక్కర్లు కొడుతోంది.

ఈ పరిణామాల పట్ల ప్రభాస్ ఫాన్స్ మంటెక్కిపోతున్నారు. బాహుబలి తర్వాత తమ హీరోకు ఏదీ సవ్యంగా జరగడం లేదనేది వాళ్ళ బాధ. అందులో న్యాయం ఉంది. ఇంటర్ నేషనల్ లెవెల్ లో అదరగొడుతుందనుకున్న సాహో తెలుగులోనే సరిగా ఆడలేదు. డిజాస్టర్ గా మిగిలింది. అది కూడా చాలాసార్లు వాయిదా పడుతూ వెళ్ళిందే. రాధే శ్యామ్ అప్ డేట్స్ ఇవ్వడంలోనూ జనాల సహనానికి పెద్ద పరీక్ష పెట్టారు. తీరా రిలీజయ్యాక కనీసం యావరేజ్ కాలేకపోయింది. సరే ఇప్పుడు ఆది పురుష్ ఈ గాయాలన్నీ మాన్పుతుందనుకుంటే టీజర్ తో మొదలు అన్నీ నెగటివ్ వైబ్రేషన్సే.

ప్రస్తుత వాతావరణంలో ఆది పురుష్ కంటే సలార్ రావడమే మేలని వాళ్ళ అభిప్రాయం. గ్రాఫిక్స్ మీద వచ్చిన విమర్శలను సీరియస్ గా తీసుకుని దర్శకుడు ఓం రౌత్ ఏదో అద్భుతం చేస్తాడన్న నమ్మకం పెద్దగా లేదు. ట్రైలర్ కట్ బయటికి వస్తే కానీ దీని గురించి కంక్లూజన్ కు రాలేం. పైగా పాటలెలా కంపోజ్ చేశారో. ఇంతకీ మ్యూజిక్ అందిస్తున్న అజయ్ అతుల్ ల నేపధ్యం ఏమిటో అర్థం కాక హైప్ ఉండాల్సిన స్థాయిలో లేదు. ఇన్ని ప్రతికూలతలు ఉన్నప్పుడు ఈ మాత్రం అసహనం కలగడం న్యాయమే. మొత్తానికి పొంగల్ బరిలో నుంచి తప్పుకోవడం డార్లింగ్ ఫ్యాన్స్ కి మింగుడుపడటం లేదు.