RC 15 కోసం క్రేజీ ఈవెంట్ సిద్ధం

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇండియన్ స్పిల్ బర్గ్ శంకర్ కాంబినేషన్ లో రూపొందుతున్న RC 15 తాలూకు అప్ డేట్స్ కోసం అభిమానులు ఎంతగా ఎదురు చూస్తున్నారో తెలిసిందే. సోషల్ మీడియా వేదికగా నిర్మాత దిల్ రాజుని టార్గెట్ చేసుకుంటే ఆయన ఏకంగా పబ్లిక్ స్టేజి మీద తన పరిస్థితిని చెప్పుకున్నారు. విజయ్ తో వారసుడు నిర్మాణంలో ఉన్న నేపథ్యంలో దాని ప్రమోషన్ తప్ప ఇంకే ఇతర ప్రాజెక్టు గురించి పబ్లిసిటీ చేయకూడదని ఎస్విసి సంస్థ ముందుగానే ప్లాన్ చేసుకోవడం వల్ల ఇలా జరిగింది. అందరి చూపు ముందు దీనికేం టైటిల్ పెడతారా అనే దాని మీదే ఉంది. దీనికి సంబంధించి ఒక్క లీక్ బయటికి రాలేదు.

తాజా సమాచారం మేరకు ఆర్ సి 15 తాలూకు టైటిల్ లాంచ్ ఈవెంట్ ని చాలా గ్రాండ్ గా ప్లాన్ చేశారట. 2023 సంక్రాంతికి వారిసు రిలీజయ్యాక హైదరాబాద్ లేదా ముంబై ఒక చోట వేదికను సెట్ చేసుకుని ఇప్పటిదాకా కనివిని ఎరుగని స్థాయిలో ఓ పెద్ద వేడుక చేయబోతున్నట్టు తెలిసింది. ముఖ్య అతిథులుగా కెజిఎఫ్ ఫేమ్ యష్, తమిళ స్టార్ హీరో సూర్యలు ఇప్పటిదాకా కన్ఫర్మ్ అయిన వాళ్ళలో ఉన్నారని తెలిసింది. మరికొందరు గెస్టులను ఫైనల్ చేసే పని జరుగుతున్నట్టుగా తెలిసింది. ఒక అరుదైన కలయిక మధ్య నెవర్ బిఫోర్ తరహాలో టైటిల్ ని రివీల్ చేస్తారు.

కనీసం ఫస్ట్ లుక్ పోస్టర్ బయటికి రాకుండానే ఈ ప్యాన్ ఇండియా మూవీ బిజినెస్ క్రేజీగా జరుగుతోంది. ఓవర్సీస్ హక్కులు సుమారు 15 కోట్లకు అమ్ముడుపోయినట్టు వినికిడి. తెలుగు రాష్ట్రాలతో పాటు నార్త్ కు సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ ఎంక్వయిరీలు తీవ్రంగా జరుగుతున్నాయి. ఇంకా విడుదల తేదీ లాక్ చేయలేదు కాబట్టి దిల్ రాజు ప్రస్తుతం ఇవన్నీ ఫైనల్ చేసే మూడ్ లో లేరు. ముందు వారసుడుని క్లోజ్ చేసి దాని రన్ పూర్తయ్యాక అప్పుడు ఒక్కొక్కటి సెటిల్ చేయబోతున్నారు. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ పొలిటికల్ డ్రామాలో ఎస్జె సూర్య విలన్ కాగా తమన్ సంగీతం ప్రధాన ఆకర్షణ కానుంది.