బాలయ్యకు 4.. చిరుకు 7

మొత్తానికి మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య కొంచెం గ్యాప్ తర్వాత మళ్లీ బాక్సాఫీస్ పోరు చూడబోతున్నాం. చివరిగా వీరి మధ్య 2017 సంక్రాంతికి వార్ నడిచింది. అప్పుడు చిరు రీఎంట్రీ మూవీ ‘ఖైదీ నంబర్ 150’ స్పష్టమైన పైచేయి సాధించగా.. బాలయ్య వందో చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సైతం బాగానే ఆడింది.

వీరి కొత్త చిత్రాలు ‘వాల్తేరు వీరయ్య’, ‘వీర సింహారెడ్డి’ సంక్రాంతికి రిలీజ్ ఖరారు చేసుకున్న సంగతి తెలిసిందే. బాలయ్య ‘అఖండ’ తర్వాత మంచి ఊపులో ఉన్నాడు. చిరంజీవేమో ‘ఆచార్య’ డిజాస్టర్‌తో షాక్ తిని, ‘గాడ్ ఫాదర్’తో పర్వాలేదనిపించే ఫలితాన్ని అందుకున్నాడు. ‘అన్ స్టాపబుల్’ క్రేజ్ కూడా తోడై బాలయ్య మంచి జోరు మీద కనిపిస్తున్నాడు. ఐతే బాలయ్య మార్కెట్ ఎంత మెరుగైనప్పటికీ.. ఇంకా చిరును మాత్రం ఆయన మ్యాచ్ చేయలేకపోతున్నాడు. బిజినెస్ పరంగా ‘వాల్తేరు వీరయ్య’దే పైచేయి అయ్యేలా కనిపిస్తోంది.

తాజాగా చిరు, బాలయ్యల సినిమాలకు ఓవర్సీస్ బిజినెస్ డీల్ పూర్తయింది. రెండు చిత్రాలనూ నిర్మిస్తున్నది మైత్రీ మూవీ మేకర్సే కాగా.. వీటి ఓవర్సీస్ హక్కులను కూడా ఒకే సంస్థకు కట్టబెట్టింది. ఫార్స్ ఫిలిమ్స్ సంస్థ యుఎస్‌లో వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి చిత్రాలను డిస్ట్రిబ్యూట్ చేయబోతోంది. చిరు సినిమాను రూ.7 కోట్లకు కొన్న ఫార్స్ ఫిలిమ్స్.. బాలయ్య చిత్రానికి రూ.4 కోట్ల రేటు పెట్టింది. బ్రేక్ ఈవెన్ కావాలంటే ‘వాల్తేరు వీరయ్య’ దాదాపు 2 మిలియన్ డాలర్లు రాబట్టాలి. ‘వీరసింహారెడ్డి’ మిలియన్ డాలర్ల మార్కును అందుకోవాలి.

యుఎస్‌లో బాలయ్యకు ముందు నుంచి మార్కెట్ కొంచెం తక్కువే. కాబట్టే రేటు తగ్గింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా బాలయ్య సినిమా మీద చిరు చిత్రానికి 50 శాతం అయినా ఎక్కువ బిజినెస్సే జరగొచ్చు. ఐతే బిజినెస్ బాగా జరుగుతున్నప్పటికీ చిరు సినిమాలకు రికవరీ మాత్రం కష్టమే అవుతోంది. ‘గాడ్ ఫాదర్’ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుని కూడా అన్ని చోట్లా బయ్యర్లకు కొంత మేర నష్టాలే మిగిల్చింది. ఇదిలా ఉండగా మరో సంక్రాంతి సినిమా ‘వారిసు’ (తెలుగులో వారసుడు) యుఎస్ రైట్స్‌ను సైతం ఫార్స్ ఫిలిమ్సే సొంతం చేసుకుంది. రేటు రూ.7.5 కోట్ల దాకా పలికినట్లు సమాచారం.