మైత్రి సంస్థకిది పెద్ద సవాలే

నిన్న బాలకృష్ణ గోపీచంద్ మలినేనిల సినిమాకు వీరసింహారెడ్డి టైటిల్ ని అఫీషియల్ చేశారు. ఇది గత రెండు మూడు వారాలుగా లీక్ రూపంలో చక్కర్లు కొట్టింది కానీ అధికారిక ప్రకటనలో ఏదైనా కొత్త ట్విస్టు ఉంటుందేమోనని ఎదురుచూసిన ఫ్యాన్స్ కి ఫైనల్ గా వాళ్ళు కోరుకున్న దాన్నే ఫిక్స్ చేశారు. బాలయ్యతో పాటు అభిమానుల అభీష్టానికి అనుగుణంగా డిసెంబర్ కు బదులుగా సంక్రాంతికే వెళ్లాలని నిర్ణయం తీసుకుని ఆ మేరకు అనౌన్స్ మెంట్ ఇచ్చేశారు. ఇక్కడి నుంచి మైత్రికి పెద్ద సవాళ్లు మొదలు కాబోతున్నాయి. ఎందుకంటే ఇదే సీజన్ కి తెస్తామని వాల్తేర్ వీరయ్య గురించి ఎప్పుడో కన్ఫర్మ్ చేసిన సంగతి తెలిసిందే.

అదేమో మెగాస్టార్ చిరంజీవి బొమ్మ. ఇది నందమూరి బాలయ్య మాస్ మూవీ. గతంలో ఈ ఇద్దరు చాలా సార్లు పోటీ పడినప్పటికీ ఇలా ఒకే బ్యానర్ నుంచి తలపడటం మాత్రం మొదటిసారి. ఎందుకంటే చేతిలో ఉన్న రెండున్నర నెలల్లో వీటి ప్రమోషన్ల విషయంలో చాలా ఒత్తిడి ఉంటుంది. ఒకరిది ఎక్కువ మరొకరిది తక్కువ చేసినా సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తిట్ల దండకం మాములుగా ఉండదు. ఆల్రెడీ నువ్వా నేనా అంటూ పోలికల పర్వం మొదలుపెట్టేసుకున్నారు. మేమిద్దరం మంచి స్నేహితులమని చిరు బాలయ్యలు ఎన్నిసార్లు చెప్పినా క్షేత్ర స్థాయిలో వాళ్ళ ఫాలోయర్స్ మాత్రం అలా ఫీల్ కావడం లేదు.

పండగ రోజు వాల్తేర్ వీరయ్య టైటిల్ లాంచ్ తో పాటు టీజర్ రానుంది. అందులో డేట్ స్పష్టంగా చెబుతారో లేక వీరసింహారెడ్డి లాగా జస్ట్ సంక్రాంతి రిలీజ్ అని క్లూ వదిలేస్తారో వేచి చూడాలి. అసలే ఆది పురుష్, వారసుడులతో కాంపిటీషన్ చాలా తీవ్రంగా ఉంది. వాటిని తట్టుకుంటూనే వీరయ్య, వీరసింహలకు పబ్లిసిటీ చేయాల్సి ఉంటుంది. అంటే రాబోయే నవంబర్, డిసెంబర్ లు మైత్రి మేకర్స్ నాన్ స్టాప్ గా రెండింటికి ప్రచార పర్వాన్ని కొనసాగించక తప్పదు. విజయ్ దేవరకొండ ఖుషి వాయిదా వేసుకుంది కాబట్టి సరిపోయింది కానీ లేదంటే అదనంగా మూడో భారం పడి ఉండేది.