పూరి దీనికి బాగా పనికొస్తున్నాడు

ఒకప్పుడు టాలీవుడ్‌ను షేక్ చేసే హిట్లు కొట్టాడు పూరి జగన్నాథ్. ‘బద్రి’తో పవన్ కళ్యాణ్‌కు క్రేజ్ పెంచింది ఆయనే. ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్, అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి లాంటి చిత్రాలతో రవితేజను స్టార్ చేసింది ఆయనే. స్టార్‌గా ఉన్న మహేష్ బాబును ‘పోకిరి’తో సూపర్ స్టార్‌గా మార్చింది ఆయనే. ‘దేశముదురు’తో అల్లు అర్జున్‌ను పెద్ద రేంజికి తీసుకెళ్లింది ఆయనే. ఇలాంటి దర్శకుడు ఇప్పుడు సరైన విజయం లేక ఇబ్బంది పడుతున్నాడు.

మధ్యలో ‘ఇస్మార్ట్ శంకర్’తో కొట్టిన ఒక హిట్ తప్పితే చాలా ఏళ్లుగా పూరి నుంచి ఆయన స్థాయికి తగ్గ సినిమాలు రావడం లేదు. ‘ఇస్మార్ట్ శంకర్’ కూడా ఫ్లూక్ హిట్ అనే అన్నారంతా. ‘లైగర్’ మూవీతో అదే నిజం అనుకుంటున్నారందరూ. ‘లైగర్’ సినిమా చూశాక ఓ మోస్తరు స్థాయి ఉన్న హీరో కూడా పూరికి కమిట్మెంట్ ఇవ్వడం కష్టమే అనిపిస్తోంది. విజయే చాలా పెద్ద తప్పు చేశాడని అందరూ ఫీలవుతున్నారు. ఆ సినిమా చూస్తే పూరి దర్శకుడిగా పూర్తిగా ఔట్ డేట్ అయిపోయాడనే ఫీలింగ్ కలిగింది.

ఐతే దర్శకుడిగా ఫేడవుట్ అయిపోయినట్లు కనిపిస్తున్న పూరి.. నటనలో బిజీ అవుతుండడం విశేషం. ఇటీవలే ‘గాడ్ ఫాదర్’ సినిమాలో జర్నలిస్టు పాత్రలో మెరిశాడు పూరి. కేవలం ఆ పాత్ర చేయడమే కాదు.. ఈ సినిమాలో కథను నరేట్ చేసింది కూడా పూరీనే. రెండు రకాలుగా ఆయన మెప్పించాడు. పూరి పాడ్‌కాస్ట్‌లు విని.. ఈ కథను నరేట్ చేయడానికి ఆయనే కరెక్ట్ అని ఫీలై ఆ బాధ్యతను అప్పగించినట్లు చిరు చెప్పిన సంగతి తెలిసిందే.

తాజాగా పూరి ఇదే పనిని ‘ఓరి దేవుడా’ సినిమాలో కూడా చేశాడు. ఇందులో కూడా ఆయన ఒక క్యామియో రోల్ చేశాడు. తన నిజ జీవిత పాత్రలోనే ఆయన కనిపించాడు. ఆడిషన్స్‌కు వచ్చిన విశ్వక్‌ను ఆయన టెస్ట్ చేసి చూసే సన్నివేశంలో నటించాడు. దీంతో పాటు అంతకుముందు ఆయన కథను నరేట్ చేయడం కూడా జరిగింది. చిరు లాగే పూరి పాడ్‌కాస్ట్‌లు విన్న వాళ్లంతా ఆయన్ని నరేటర్‌గా పెట్టుకోవడానికి ఇష్టపడుతున్నట్లున్నారు. దర్శకుడిగా కెరీర్ దెబ్బ తిన్నా.. ఇలా క్యామియోలు చేసుకుంటూ, నరేటర్ పాత్ర పోషిస్తూ పూరి బండి నడిపించేస్తాడేమో అనిపిస్తోంది.