గీతా ఆర్ట్స్‌లో కాంతార ద‌ర్శ‌కుడి సినిమా

కాంతార సినిమాతో క‌న్న‌డ న‌టుడు, ద‌ర్శ‌కుడు రిష‌బ్ శెట్టి దేశ‌వ్యాప్తంగా మార్మోగిపోతోంది. ఈ చిత్రంలో న‌టుడిగా అద్భుత‌మైన పెర్ఫామెన్స్ ఇవ్వ‌డంతో పాటు ద‌ర్శ‌కుడిగా గొప్ప నైపుణ్యం చూపించాడు రిష‌బ్‌. కెరీర్లో ఇప్ప‌టిదాకా అత‌ను తెచ్చుకున్న పేరంతా ఒకెత్త‌యితే.. ఈ సినిమాతో వ‌చ్చిన పేరు మ‌రో ఎత్తు. సామాన్య ప్రేక్ష‌కుల నుంచి పేరుమోసిన క్రిటిక్స్, ఫిలిం మేక‌ర్స్ వ‌ర‌కు అంద‌రూ అత‌డిపై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపిస్తున్నారు.

కాంతార చూశాక రిష‌బ్ గ‌త సినిమాల‌ను వెతికి వెతికి చూస్తున్నారు జ‌నం. ఇప్పుడ‌త‌ను మోస్ట్ వాంటెడ్ డైరెక్ట‌ర్స్ క‌మ్ యాక్ట‌ర్స్‌లో ఒక‌డైపోయాడు. ఇలా ఎక్క‌డ టాలెంట్ క‌నిపించినా టాలీవుడ్ నిర్మాత‌లు బుక్ చేసేయ‌డం మామూలే. కాంతార సినిమాను తెలుగులో రిలీజ్ చేసిన అగ్ర నిర్మాత అల్లు అర‌వింద్ కూడా రిష‌బ్ కోసం క‌ర్చీఫ్ వేసేశారు.

కాంతార స‌క్సెస్ మీట్ సంద‌ర్భంగా అర‌వింద్ స్వ‌యంగా ఈ మేర‌కు ప్ర‌క‌ట‌న చేశౄడు. త‌మ గీతా ఆర్ట్స్ బేన‌ర్లో సినిమా చేయాల‌ని రిష‌బ్‌ను అడిగాన‌ని, అత‌ను ఒప్పుకున్నాడ‌ని వేదిక మీదే ప్ర‌క‌టించాడు. కాగా ఈ విష‌యాన్ని ఒక వెబ్ సైట్ ట్విట్ట‌ర్లో పోస్ట్ చేయ‌గా.. ఒక క‌న్న‌డ అభిమాని వెంట‌నే ఒక కౌంట‌ర్ వేశాడు. నువ్వు కూడా క‌న్న‌డ ఇండ‌స్ట్రీని వ‌దిలి వెళ్లిపోతున్నావా అని రిష‌బ్‌ను ట్యాగ్ చేసి ప్ర‌శ్నించాడు. ఎవ‌డో అనామ‌కుడు అడిగాడ‌ని రిష‌బ్ దీన్ని ప‌ట్టించుకోకుండా వ‌దిలేయ‌లేదు. ఛాన్సే లేదు, నో వే అంటూ క‌న్న‌డ‌లో స‌మాధానం ఇచ్చాడు.

క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్‌ కేజీఎఫ్‌తో సంచ‌ల‌నం రేపాక‌.. టాలీవుడ్ హీరోలు, నిర్మాత‌లు అత‌డిపై ప‌డిపోయారు. ప్ర‌భాస్‌తో ఆల్రెడీ స‌లార్ చేస్తున్న ప్ర‌శాంత్‌.. త‌ర్వాత ఎన్టీఆర్‌తో ఓ సినిమా చేయాల్సి ఉంది. త‌ర్వాత కూడా అత‌ను తిరిగి శాండిల్‌వుడ్‌కు వెళ్ల‌డం క‌ష్టంగా ఉంది. పేరు తెచ్చుకున్నాక క‌న్న‌డ ఇండ‌స్ట్రీని వ‌దిలేశాడంటూ ప్ర‌శాంత్ మీద ఆల్రెడీ క‌న్న‌డిగులు ఆగ్ర‌హంతో ఉన్నారు. ఇప్పుడు రిష‌బ్ కూడా ఆ బాట‌లో ప‌య‌నిస్తాడేమో అన్న ఉద్దేశంతోనే ఓ నెటిజ‌న్ ఈ వ్యాఖ్య చేయ‌గా.. రిష‌బ్ ఛాన్సే లేద‌ని స‌మాధానం ఇచ్చాడు.