పిఎస్ 1 ఓడిపోయింది అందుకే

తమిళంలో ఎంత నెత్తిన బెట్టుకున్నా, ప్రపంచవ్యాప్తంగా వసూళ్లు 400 కోట్లు దాటాయని అఫీషియల్ గా చాటినా పొన్నియన్ సెల్వన్ 1 తెలుగులో ఇప్పటిదాకా బ్రేక్ ఈవెన్ అందుకోలేదని ట్రేడ్ టాక్. కేవలం 10 కోట్ల థియేట్రికల్ బిజినెస్ తో బరిలో దిగిన ఈ పీరియాడిక్ డ్రామా మొదటి రెండు మూడు రోజులు బాగానే రాబట్టినప్పటికీ దసరాకు వచ్చిన టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాల దెబ్బకు నెమ్మదిగా తగ్గుతూ పోయి ఫైనల్ గా క్లోజింగ్ రన్ కు వచ్చేసింది. ఇక్కడ దీని మీద డివైడ్ టాక్ వచ్చినప్పుడు కోలీవుడ్ రివ్యూయర్లు ఆడియన్స్ సోషల్ మీడియా వేదికగా మన ప్రేక్షకుల టేస్ట్ మీద ఘాటు కామెంట్లు చేశారు.

ఇప్పుడు కాంతార సక్సెస్ ని కళ్లారా చూశాక ఎవరికీ నోటమాట రావడం లేదు. ఏపీ తెలంగాణలో రెండు రోజులకే అయిదు కోట్ల షేర్ రాబట్టడం చూసి కెజిఎఫ్ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన ఇదే హోంబాలే సంస్ధ షాక్ తింది. మరి పొన్నియన్ సెల్వన్ ని రిసీవ్ చేసుకోలేని తెలుగు జనాలు కాంతారను ఎందుకంత ఓన్ చేసుకున్నారనే ప్రశ్నకు విశ్లేషణ చేసుకోవడం చాలా అవసరం.

మణిరత్నం టెక్నికల్ గా ఎంత గొప్ప స్టాండర్డ్ లో పీఎస్ 1 తీసినప్పటికీ అందులో గ్రాండియర్ ఉన్నంత గొప్పగా ఎమోషన్ లేదు. పైగా తమిళులకు మాత్రం పరిచయమున్న చోళుల నేపధ్యాన్ని గ్లోబల్ ఆడియన్స్ ని కనెక్ట్ చేయలేక కన్ఫ్యూజ్ చేశారు.

దీంతో ఇప్పుడీ ఫలితం దక్కింది. మణిరత్నం లాంటి లెజెండ్ ని రిషబ్ శెట్టి అనే అప్ కమింగ్ హీరో కం దర్శకుడు అధిగమించడమంటే మాటలు కాదు. పైగా పొన్నియన్ సెల్వన్ లో ఉన్న రాజప్రాసాదపు కుట్రల నేపధ్యం కానీ, ఇండస్ట్రీలో స్టార్ల కలయిక కానీ కాంతారలో లేవు. అయినా కూడా శాండల్ వుడ్ క్రియేటివిటీకి ఇక్కడ బ్రహ్మరథం దక్కుతోంది. ఓవర్సీస్ లోనూ మాములు దూకుడు చూపించడం లేదు. ఈ లెక్కన పొన్నియన్ సెల్వన్ 2కి అరవంలో భీభత్సమైన క్రేజ్ రావొచ్చేమో కానీ మనదగ్గర మాత్రం సాధారణ అంచనాలతోనే మొదలవుతుంది. దాంట్లో ఏం చేయబోతున్నారో లెట్ వెయిట్ అండ్ సీ.