తెలుగు సినిమాలు నిర్మించబోతున్న ధోని

ఇండియన్ క్రికెట్ హిస్టరీలో దేశవ్యాప్తంగా అత్యంత అభిమానం సంపాదించుకున్న క్రికెటర్లలో ముందు సచిన్ టెండుల్కర్ పేరు చెప్పుకుంటే ఆ తర్వాత చెప్పుకోవాల్సిన పేరు మహేంద్రసింగ్ ధోనిదే. మన క్రికెట్ చరిత్రలో కపిల్ దేవ్, గంగూలీ, కోహ్లి, సెహ్వాగ్, ద్రవిడ్.. ఇలా దిగ్గజ స్థాయి ఉన్న ఆటగాళ్ల జాబితా పెద్దదే కానీ.. సచిన్ తర్వాత ఆ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్, ఎమోషనల్ కనెక్షన్ తెచ్చుకున్న క్రికెటర్ ధోనీనే.

అతను పుట్టి పెరిగింది రాంచిలో కానీ.. దేశం మొత్తం తమ వాడిలా చూస్తుంది ధోనీని. ముఖ్యంగా సౌత్ ఇండియాతో ధోనీకి ఉన్న కనెక్షనే వేరు. ఐపీఎల్‌లో మొదట్నుంచి చెన్నై సూపర్ కింగ్స్‌కే ఆడడం, ఆ జట్టును నడిపించడం వల్ల ధోనీని దత్తపుత్రుడిలా చూస్తారు తమిళులు. మన దగ్గరా ధోనీకి ఉన్న అభిమానమే వేరు. ఈ కనెక్షన్ వల్లేనేమో సొంతంగా నిర్మాణ సంస్థను నెలకొల్పుతున్న ధోని.. తమిళ, తెలుగు భాషల్లో సినిమాలు నిర్మిస్తానంటున్నాడు.

‘ధోని ఎంటర్టైన్మెంట్’ పేరుతో బేనర్ మొదలుపెట్టిన ధోని.. తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో సినిమాలు నిర్మించబోతున్నట్లు అనౌన్స్‌మెంట్ ఇచ్చాడు. ధోని బేసిగ్గా ఉత్తరాది వాడు కావడంతో తన నిర్మాణ సంస్థలో హిందీ సినిమాలు ప్రొడ్యూస్ చేస్తాడని అనుకుంటాం. కానీ ఇప్పుడు బాలీవుడ్ పరిస్థితి ఏమంత బాగా లేదనో లేక తనకు సౌత్‌లో ఉన్న సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ చూసో.. అతను ఇక్కడి భాషల్లో సినిమాలు తీయాలనుకుంటున్నాడు.

ధోనీకి సినిమాలతో ఇప్పటికే కనెక్షన్ ఉంది. అతడి జీవిత కథ ఆధారంగా తీసిన ‘ఎం.ఎస్.ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ’లో అతను నిర్మాణ భాగస్వామి కూడా. పెట్టుబడి ఏమీ పెట్టకుండా తన జీవిత కథ మీద సినిమా తీసినందుకు గాను రాయల్టీ కింద సినిమా లాభాల్లో వాటా తీసుకున్నాడు. ఈ చిత్రాన్ని తనే స్వయంగా ప్రమోట్ చేశాడు కూడా. ఇప్పుడు పూర్తి స్థాయిలో ప్రొడక్షన్ హౌస్ పెట్టి సౌత్ లాంగ్వేజెస్‌లో సినిమాలు తీయబోతున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచాడు.