ధ‌నుష్‌-క‌మ్ముల సినిమా ప‌రిస్థితేంటి?


గ‌త ఏడాది ఇటు తెలుగు, అటు త‌మిళ ప్రేక్ష‌కుల‌ను ఆశ్చ‌ర్య‌ప‌రిచిన సినిమా అనౌన్స్‌మెంట్ అంటే.. టాలీవుడ్ డైరెక్ట‌ర్ శేఖ‌ర్ క‌మ్ముల‌, కోలీవుడ్ స్టార్ హీరో ధ‌నుష్‌ల క‌ల‌యిక‌లోనిదే. ఈ కాంబినేష‌న్లో సినిమాను అసలెవ‌రూ ఊహించ‌లేదు. ఒక త‌మిళ స్టార్ తెలుగు ద‌ర్శ‌కుడితో సినిమా చేయ‌డ‌మే ఆశ్చ‌ర్య‌మంటే.. అత‌ను క‌మ్ముల‌తో మూవీని ఓకే చేయ‌డం ఇంకా ఆశ్చ‌ర్యం.

ఐతే అనౌన్స్‌మెంట్ హ‌డావుడి త‌ర్వాత ఈ సినిమా ముందుకే క‌ద‌ల్లేదు. దీని త‌ర్వాత ప్ర‌క‌టించిన సార్ మూవీని ధ‌నుష్ చ‌క‌చ‌కా పూర్తి చేసేశాడు. కొత్త‌గా వేరే చిత్రాలు ప్ర‌క‌టిస్తున్నాడు. కానీ క‌మ్ముల సినిమా సంగ‌తేంటో తెలియ‌డం లేదు. శేఖ‌ర్ చివ‌రి సినిమా ల‌వ్ స్టోరీ నిరాశ‌ప‌రిచిన నేప‌థ్యంలో ఈ సినిమా నుంచి ధ‌నుష్ వైదొలిగాడేమో అన్న సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఐతే అలాంటిదేమీ లేద‌న్న‌ది చిత్ర వ‌ర్గాల స‌మాచారం.

మామూలుగానే శేఖ‌ర్ క‌మ్ముల సినిమాకు సినిమాకు చాలా గ్యాప్ తీసుకుంటాడు. స్క్రిప్టు కోసం చాలా స‌మ‌యం వెచ్చిస్తాడు. హ‌డావుడి ప‌డ‌డు. ధ‌నుష్ సినిమా విష‌యంలోనూ అదే చేస్తున్నాడ‌ట‌. అత‌డి కోసం ఒక పీరియ‌డ్ క‌థ‌ను క‌మ్ముల రెడీ చేస్తున్న‌ట్లు స‌మాచారం. త‌మిళ‌నాడులో స్థిర‌ప‌డే ఒక తెలుగు కుర్రాడి క‌థ ఇద‌ని, కొన్ని ద‌శాబ్దాల వెనుక‌టి కాలంలో న‌డుస్తుంద‌ని.. ఇటు తెలుగు, అటు త‌మిళ ప్రేక్ష‌కుల‌ను మెప్పించేలా యూనివ‌ర్శ‌ల్ అప్పీల్ ఉన్న క‌థ ఇద‌ని చిత్ర వ‌ర్గాల స‌మాచారం.

ప‌క్కాగా స్క్రిప్టు రెడీ అయ్యాక ధ‌నుష్ డేట్లు చూసుకుని సినిమాను ప‌ట్టాలెక్కిస్తార‌ని స‌మాచారం. వ‌చ్చే ఏడాదే ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్లే అవకాశాలున్నాయి. ఈ చిత్రాన్ని సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహ‌న్ రావు నిర్మించ‌నున్నారు. ధ‌నుష్ ప్ర‌స్తుతం కెప్టెన్ మిల్ల‌ర్ అనే సినిమాలో న‌టిస్తున్నాడు.