‘ఆదిపురుష్’ టీం ఎత్తుగడ ఫలించిందా?


‘ఆదిపురుష్’ టీజర్ రిలీజ్ తర్వాత ఈ సినిమా మీద జరిగిన ట్రోలింగ్ చూసి చిత్ర బృందం బెంబేలెత్తిపోయే ఉంటుంది. ఎందుకంటే అదేమీ చిన్నా చితకా చిత్రం కాదు. ఏకంగా ఐదొందల కోట్ల బడ్జెట్లో తీసిన భారీ సినిమా. నటీనటుల మీద చిత్రీకరించిన సన్నివేశాలను తక్కువ రోజుల్లోనే పూర్తి చేసిన చిత్ర బృందం.. ఏడాదికి పైగా ప్రపంచ వ్యాప్తగా అనేక విజువల్ ఎఫెక్ట్స్ స్టూడియోలతో కోఆర్డినేట్ చేసుకుంటూ పోస్ట్ ప్రొడక్షన్ పని పూర్తి చేసింది. ఫస్ట్ కాపీ దాదాపుగా రెడీ అయ్యాక టీజర్ లాంచ్‌తో ప్రమోషన్లతో ఘనంగా మొదలుపెట్టింది. కానీ టీజర్‌కు వచ్చిన నెగెటివ్ రెస్పాన్స్ చిత్ర బృందానికి పెద్ద షాకే.

ఈ ట్రోలింగ్ ఊహించనిదేమీ కాదంటూనే.. విమర్శలు తమను బాధించాయని అంగీకరించాడు దర్శకుడు ఓం రౌత్. ఈ నెగిటివిటీని తగ్గించేందుకు చిత్ర బృందం వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ముంబయిలో మీడియా వాళ్లకు ప్రత్యేకంగా త్రీడీ టీజర్ ప్రదర్శించి చూపించింది. అక్కడ పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చాక.. సౌత్ మీద దృష్టిపెట్టింది.

చెన్నై, బెంగళూరు, కొచ్చి నుంచి జర్నలిస్టులను పిలిపించి, తెలుగు మీడియా వారిని కూడా రప్పించి గురువారం హైదరాబాద్‌లోని ఏఎంబీ సినిమాస్‌లో ‘ఆదిపురుష్’ త్రీడీ టీజర్ ప్రదర్శించారు. ఈ టీజర్ చూసిన వాళ్లందరూ చెబుతున్నది ఒకటే మాట. విజువల్ ఎఫెక్ట్స్ ఇందులో చాలా బాగా కనిపించాయని. టీజర్ మీద అభిప్రాయం మారిందని. పిల్లలను కచ్చితంగా ఈ వెర్షన్ ఆకట్టుకుంటుందనే ఫీడ్ బ్యాక్ వస్తోంది.

మొబైల్లో చూసిందానికి, పెద్ద తెరపై త్రీడీలో విజువల్స్ చూడడానికి చాలా తేడా ఉందనే అభిప్రాయాలు మీడియా వాళ్లు వ్యక్తం చేస్తున్నారు. కాకపోతే ఇక్కడి వరకు నెగెటివిటీని తగ్గించగలిగినా.. రావణుడు, హనుమంతుడు లుక్స్ విషయంలో మాత్రం అభ్యంతరాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా రావణుడిగా సైఫ్ అవతారాన్ని జనాలు జీర్ణించుకోలేకపోతున్నారు. రావణుడిది విలన్ పాత్ర కాబట్టి జనాలు పెద్దగా పట్టించుకోరని అనుకున్నారేమో కానీ.. ఈ పాత్రతో మన నిన్నటితరం ప్రేక్షకులకు ఒక ఎమోషనల్ కనెక్ట్ ఏర్పడేలా చేశారు ఎస్వీ రంగారావు, ఎన్టీరామారావు లాంటి వాళ్లు.