2009 డిజాస్టర్ – మళ్ళీ రీరిలీజా

గత రెండు నెలలుగా టాలీవుడ్ బాక్సాఫీస్ రీ రిలీజులతో ఊగిపోతోంది. ప్రేక్షకుల ఆదరణ సైతం అలాగే ఉంది. పోకిరి ఊహించని స్థాయిలో రెండు కోట్లకు దగ్గరగా వసూళ్లు సాధిస్తే నేనేం తక్కువా అన్నట్టు జల్సా ఏకంగా మూడు కోట్ల మార్కును దాటించి ఔరా అనిపించింది, తాజాగా చెన్నకేశవరెడ్డి ఓవర్సీస్ లోనూ దుమ్ము దులుపుతోంది. ఇంకో రెండు రోజుల్లో ఫైనల్ ఫిగర్స్ వస్తాయి కాబట్టి ఏ స్థాయి రికార్డులు అందుకుందో వేచి చూడాలి. ఆ మధ్య హైదరాబాద్ లో ఒక్కడుకి సైతం భారీ రెస్పాన్స్ వచ్చింది. ఘరానా మొగుడుకి హౌస్ ఫుల్స్ పడిన థియేటర్లున్నాయి.

ఇవన్నీ సరే అప్పట్లో జనం మెచ్చినవి డబ్బులు ఇచ్చినవి అనుకోవచ్చు. కానీ డిజాస్టర్లను రీ రిలీజ్ చేయడం మాత్రం జరంత టూ మచ్ అనే చెప్పాలి. ఆ మధ్య ధనుష్ శృతి హాసన్ ల 3ని ఇదే తరహాలో పునఃవిడుదల చేస్తే యూత్ బాగానే ఎగబడి చూశారు. నిజానికది ఫస్ట్ రిలీజ్ అయిన టైంలో వారం రోజులకే డబ్బాలు వెనక్కు వచ్చాయి. ఏదో కొలవెరి పాట వైరల్ కావడం వల్ల ఒక రెండు రోజులు కలెక్షన్లు వచ్చాయి కానీ మ్యాటర్ మరీ వీక్ ఉండటంతో జనం తిరస్కరించారు. కట్ చేస్తే ఇప్పుడొచ్చిన 3 మాత్రం ఇంకా కొన్ని చోట్ల వారం తర్వాత ఆడుతూ ఉండటం అసలు ట్విస్టు.

ఇప్పుడు 2009లో వచ్చిన నితిన్ కళాఖండం అడవిని అక్టోబర్ 14న రీ రిలీజ్ చేస్తారట. హిందీలో అగ్యాత్ గా దీన్ని మల్టీ లాంగ్వేజ్ గా తీశారు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. మొదటి ఆటకే జనం బాబోయ్ అన్నారు. షూటింగ్ కోసం అడవికి వెళ్లిన ఓ సినిమా యూనిట్ ని కనిపించని ఓ కిల్లర్ దారుణంగా చంపుతూ ఉంటాడు. అతని ఆట కట్టించడమే ఇందులో పాయింట్. నిడివి కూడా చాలా తక్కువ. 1 గంట 40 నిమిషాల లోపే అయిపోతుంది. ఎంత యుట్యూబ్, ఓటిటిలో లేదన్నంత మాత్రాన ఇలా థియేటర్లో వదిలి మళ్ళీ ఆ గాయం గుర్తు చేయడం ఎందుకని నితిన్ ఫ్యాన్స్ వాపోతున్నారు. వర్మ వినే టైపు కాదుగా.