ధనుష్ సినిమాకు మళ్ళీ అదే అలసత్వం

తొలుత సూపర్ స్టార్ రజనీకాంత్ అల్లుడిగా ఎక్కువ గుర్తింపు ఉన్నప్పటికీ తన స్వంత టాలెంట్ తో ఎదిగిన హీరో ధనుష్. తమిళంలోనే కాదు బాలీవుడ్ నుంచి హాలీవుడ్ దాకా అన్ని రకాల సినిమాలు చేసి ప్రత్యేకమైన ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. రఘువరన్ బిటెక్ పెద్ద హిట్టయ్యాక ఇక్కడ చెప్పుకోదగ్గ సక్సెస్ లు లేకపోయినా తెలుగు ఆడియన్స్ లోనూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అందుకే వడ చెన్నై, అసురన్ (తెలుగు నారప్ప), కర్ణన్ లాంటి కల్ట్ క్లాసిక్స్ మనకు డబ్బింగ్ కాకపోయినా వాటిని అదే పనిగా సబ్ టైటిల్స్ తో చూసిన ఫ్యాన్స్ టాలీవుడ్ లో కొల్లలుగా ఉన్నారు.

ఇటీవలే వచ్చిన తిరు కూడా సూపర్ సక్సెసే. కేవలం పబ్లిసిటీ లోపం వల్ల ఏపి తెలంగాణలో ఆశించిన స్థాయిలో జనానికి రీచ్ అవ్వలేదు కానీ తమిళనాడుతో పాటు ఓవర్ సీస్ కలిపి ఏకంగా వంద కోట్ల గ్రాస్ ని సాధించి ధనుష్ కి బ్లాక్ బస్టర్ ఇచ్చింది. అలాంటి తిరు తర్వాత 29న రిలీజవుతున్న మూవీగా నేనే వస్తున్నా మీద ఎలాంటి హైప్ ఉండాలి. కానీ ఆ సూచనలేమి లేవు. గీతా ఆర్ట్స్ పంపిణి బాధ్యతలు తీసుకున్నప్పటికీ హీరోను తీసుకొచ్చి కనీసం ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చేయలేకపోయారు. అవతల పొన్నియన్ సెల్వన్ 1 కోసం మణిరత్నం టీమ్ భీభత్సమైన ప్రమోషన్ చేస్తోంది.

పరిస్థితి ఇలా ఉంటే అడ్వాన్స్ బుకింగ్స్ ఆశించడం అత్యాశే అవుతుంది. అందుకే నాలుగైదు రోజులు ముందు ఓపెన్ చేసినా ఆశించినంత జోష్ కనిపించడం లేదు. నిజానికి ట్రైలర్ చూశాక నేనే వస్తున్నా మీద మంచి అంచనాలు ఏర్పడ్డాయి. డ్యూయల్ రోల్ లో ధనుష్ చాలా ఇంటెన్స్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడని అర్థమైపోయింది. పైగా ఇతని స్వంత అన్నయ్య కల్ట్ డైరెక్టర్ సెల్వ రాఘవన్ ప్రోడక్ట్ కావడంతో హైప్ ఆటోమేటిక్ గా వచ్చేస్తుందని అనుకున్నారు. తీరా చూస్తే ఇదిగో ఇలా జరుగుతోంది. రెగ్యులర్ ట్రెండ్ కి భిన్నంగా యుఎస్ ప్రీమియర్లు కూడా ఇండియన్ టైం ప్రకారం ఉదయం 8 తర్వాతే వేయాలని డిసైడ్ చేశారట. ఎందుకో మరి