రెండు నిమిషాల స్పీచ్.. కోట్ల రూపాయల ప్రమోషన్


‘పొన్నియన్ సెల్వన్’ సినిమాకు ముందు నుంచి తమిళనాడు అవతల అనుకున్న స్థాయిలో బజ్ కనిపించకపోవడానికి కారణం.. నేటివిటీ ఫ్యాక్టర్. పేరు దగ్గర్నుంచి ప్రతి విషయంలోనూ తమిళ వాసనలు గుప్పుమన్నాయి. ఈ కథ కూడా తమిళనాడును ఏలిన చోళ రాజుల గురించి కావడంతో, వారి చరిత్రతో ముడిపడ్డ అంశాలనే సినిమాల్లో చూపించినట్లు కనిపించడంతో మిగతా వాళ్లు అంతగా కనెక్ట్ కాలేకపోయారు.

ఐతే రిలీజ్ దగ్గర పడేసరికి తమిళనాడు అవతల కూడా ప్రమోషన్ల హడావుడి కొంచెం పెరిగింది. ప్రేక్షకుల్లోనూ మెల్లగా ఈ సినిమాపై ఆసక్తి పెరుగుతోంది. ఐతే ఇప్పటిదాకా ప్రమోషన్ల పరంగా చిత్ర బృందం పడ్డ కష్టం, పెట్టిన ఖర్చు అంతా ఒకెత్తయితే.. ఇందులో ముఖ్య పాత్ర పోషించిన విక్రమ్ ఒక ప్రెస్ మీట్లో ఇచ్చిన రెండు నిమిషాల స్పీచ్ మరో ఎత్తు అనే చెప్పాలి. అసలు ‘పొన్నియన్ సెల్వన్’ ఎందుకు చూడాలనే విషయాన్ని విక్రమ్ చాలా గొప్గపా చెప్పాడు.

మన చరిత్ర గొప్పదనాన్ని తెలియజేస్తూ.. చోళ రాజులు ఎన్ని గొప్ప పనులు చేశారో.. ఎన్నో శతాబ్దాల ముందే నాగరికత విషయంలో మనం ప్రపంచంలోని మిగతా దేశాల కంటే ముందున్నామో చాలా గొప్పగా చెప్పాడు ఈ వీడియోలో విక్రమ్. అదేదో సినిమా ప్రమోషన్ కోసం చెప్పినట్లు కాకుండా చరిత్రను బాగా అర్థం చేసుకుని ఒక తపనతో, నిజాయితీతో చెప్పిన మాటల్లాగా అనిపించాయి నెటిజన్లకు. విశేషం ఏంటంటే.. విక్రమ్ ఈ మాటలు చెబుతున్నపుడు ఎక్కడా కూడా ‘పొన్నియన్ సెల్వన్’ పేరెత్తలేదు. ఈ సినిమా చూడండి అనలేదు. కానీ మన చరిత్రను తెలుసుకుందాం, దాన్ని చూసి గర్విద్దాం అంటూ అందరినీ కదిలించేశాడు.

ఈ వీడియోను భాషలకు అతీతంగా అందరూ మెచ్చుకుంటూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ‘పొన్నియన్ సెల్వన్’ సినిమా తప్పక చూడాలి అని ఈ వీడియో చూసి కామెంట్లు చేస్తున్నారు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చేసే ప్రమోషన్లకు మించి.. రెండు నిమిషాల స్పీచ్‌తో సినిమాకు విక్రమ్ ఎక్కువ ప్రచారం చేసి పెట్టాడన్నది స్పష్టం.