భారీ ప్లాన్లతో ఆది పురుష్ రెడీ

Adipurush
Adipurush

షూటింగ్ ఎప్పుడో మొదలుపెట్టి నెలల క్రితమే పూర్తి చేసినా ఇప్పటిదాకా కనీసం ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా లేకుండా ఆలస్యం చేస్తూ వచ్చిన ఆది పురుష్ టీమ్ ఎట్టకేలకు ప్రమోషన్లకు రెడీ అవుతున్నట్టుగా బాలీవుడ్ టాక్. వచ్చే నెల 3న దసరా పండగ కంటే ముందు భారీ ఎత్తున టీజర్ లాంచ్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయట. ఫైనల్ కట్ పనులను దర్శకుడు ఓం రౌత్ పర్యవేక్షిస్తున్నాడు. పెదనాన్న కృష్ణంరాజు దూరమైన విషాదాన్ని ప్రభాస్ అంత తేలిగ్గా మర్చిపోవడం సాధ్యం కాదు కానీ ఆ టైంకంతా కొంతైనా కోలుకుని ఉంటారని అభిమానులు ఆశిస్తున్నారు.

ఇప్పటిదాకా ఇండియన్ స్క్రీన్ మీద చూడని విజువల్ ఎఫెక్ట్స్ ఆది పురుష్ లో ఉన్నాయని చెబుతున్న కారణంగా ఆ అంచనాలను పూర్తిగా అందుకునేలా టీజర్ ని ఎడిట్ చేయిస్తున్నట్టు తెలిసింది. అంతే కాదు 2023 జనవరి 12 విడుదల తేదీని లాక్ చేస్తూ అఫీషియల్ గా ప్రకటించే అవకాశాలున్నాయి. ఓం రౌత్ గత చిత్రం తానాజీ కూడా 2020లో అదే నెలలో వచ్చి ఘనవిజయం అందుకుంది. సీజన్ పరంగానూ టాలీవుడ్ కు సంక్రాంతి బెస్ట్ కాబట్టి డార్లింగ్ శ్రీరాముడిగా రావడం ఆల్మోస్ట్ ఫిక్స్ అయినట్టే. ప్రస్తుతానికి చిరంజీవి వాల్తేర్ వీరయ్య ఒకటే అధికారికంగా ఆ టైంకి వస్తానని గతంలో చెప్పింది.

సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా నటిస్తున్న ఆది పురుష్ ని కంప్లీట్ త్రీడి వెర్షన్ లో రూపొందించారు. ఇటీవలే విడుదలైన బ్రహ్మాస్త్రలో విజువల్ ఎఫెక్ట్స్ మరీ ఎక్స్ ట్రాడినరీగా లేకపోయినా నార్త్ ఆడియన్స్ వసూళ్ల వర్షం కురిపించారు. అలాంటిది మైండ్ బ్లోయింగ్ తరహాలో శ్రీరాముడి గాథను చూపిస్తే ఏమైపోతారో వేరే చెప్పాలా. ఇందులో కృతి సనన్ సీతగా నటిస్తోంది. టెక్నికల్ టీమ్ కు సంబంధించిన డిటైల్స్ ని ఇప్పటిదాకా గుట్టుగా ఉంచారు. అన్నీ మూడో తేదీనే ఓపెన్ కాబోతున్నాయి. ప్యాన్ ఇండియా లెవెల్ లో రాబోతున్న ఈ విజువల్ గ్రాండియర్ ఒక్క ఇండియాలోనే పదిహేను వందల కోట్లు రాబడుతుందని ట్రేడ్ అంచనా.