శర్వా జీవితం మలుపు తిరిగేనా

వరస ఫ్లాపులతో సతమతమవుతున్న శర్వానంద్ కు ఒకే ఒక జీవితం సక్సెస్ కావడం చాలా అవసరం. రణరంగం లాంటి గ్యాంగ్ స్టర్ డ్రామా చేసినా, జాను లాంటి ప్రూవ్డ్ రీమేక్ తో వచ్చినా గత మూడేళ్లుగా ఫలితం మాత్రం డిజాస్టర్ కు తక్కువ కాకుండా రిపీటవుతూనే వచ్చింది. ఆఖరికి ఎంతోకష్టపడి మంచి ఉద్దేశంతో శ్రీకారం ఇస్తే అదీ నిరాశపరిచింది. అలా అని ప్రయోగాలు ఆపలేదు కానీ మొత్తానికి ఈసారి మాత్రం తనను నమ్మమని ఖచ్చితంగా డిజప్పోయింట్ చేయనని హామీ ఇస్తున్నాడు. నిన్న హైదరాబాద్ ఏఎంబి మాల్ లో సెలబ్రిటీలకు వేసిన స్పెషల్ షో నుంచి మంచి స్పందనే వచ్చింది.

నాగార్జున ఏకంగా ఎమోషనలైపోయి కన్నీళ్లు పెట్టుకున్నంత పని చేశారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనూ వచ్చినవాళ్లందరి మాటలు పాజిటివ్ వైబ్రేషన్స్ ఇచ్చాయి. సరే ఇది కామనే అనుకున్నా కంటెంట్ మీద నమ్మకంతో మీడియాకు సైతం ఒక రోజు ముందు సాయంత్రమే ప్రీమియర్ వేయడం చూస్తుంటే ఖచ్చితంగా హిట్ అవుతుందనే ధీమా నిజమయ్యేలా ఉంది. కాకపోతే అడ్వాన్స్ బుకింగ్స్ ఏమంత ఆశాజనకంగా లేవు. పూర్తిగా మౌత్ టాక్ మీద ఆధారపడిన ఒకే ఒక జీవితంకు అది కనక పాజిటివ్ గా ఉంటే మాత్రం నిశ్చింతగా విజయం కోసం ఎదురు చూడొచ్చు

ఎటొచ్చి మెట్రో నగరాల్లో బ్రహ్మాస్త్ర నుంచి థ్రెట్ ఉన్న మాట వాస్తవం. దీనికి ఏబి సెంటర్స్ లో బుకింగ్స్ బాగా జరుగుతున్నాయి. త్రీడి ఎక్స్ పీరియన్స్ తో చూసేందుకు ఆడియన్స్ ప్లాన్ చేసుకుంటున్నారు. దీంతో పోలిస్తే ఒకే ఒక జీవితంలో అలాంటి గ్రాఫిక్స్ హంగులేమీ లేవు. అయినా బ్రహ్మాస్త్రకు సైతం రివ్యూలు టాక్ కీలకం. అసలే బాలీవుడ్ వరస డిజాస్టర్లతో బెంబేలెత్తిపోయింది. బాయ్ కాట్ భయాల మధ్య యావరేజ్ అనిపించుకున్నా లాభం లేదు . అదిరిపోయిందంటేనే జనం థియేటర్లకు వస్తున్నారు. ఇండియా వైడ్ అక్కర్లేదు కానీ ఒకే ఒక జీవితంకు తెలుగు తమిళంలో పాసైతే అదే పది వేలు. చూద్దాం ఇంకొద్ది గంటల్లో తేలిపోతుందిగా