హీరోకి అప్పులు .. ఆరేళ్ళ ఇబ్బందులు

హీరోలకు సినిమాల్లోనే కష్టాలుంటాయనుకుంటాం. నిజ జీవితంలో వారికి అప్పులు , ఇబ్బందులు ఉంటాయనే ఊహ కూడా రాదు. కానీ సినిమాల్లోనే కాదు నిజజీవితంలోనూ హీరోలకు అప్పుడప్పుడు కష్టాలు ఇబ్బందులు వస్తూ ఉంటాయి. తాజాగా హీరో శర్వానంద్ తన జీవితంలో వచ్చిన కష్టాన్ని అప్పు వల్ల పడిన ఇబ్బందులను షేర్ చేసుకున్నాడు. దర్శకుడు తరుణ్ భాస్కర్ తో కలిసి ఒకే ఒక జీవితం సినిమా గురించి స్పెషల్ ఇంటర్వ్యూ చేశాడు శర్వా. ఈ షో లో ఇద్దరు దిల్ సే అంటూ ఆర్గానిక్ గా మాట్లాడుకున్నారు.

ఓ సందర్భంలో లైఫ్ లో వచ్చే ఇబ్బందుల గురించి ఒకరికరు చెప్పుకున్నారు. నాన్న మరణం తర్వాత తన చుట్టూ ఉన్న వాళ్ళ గురించి తెలిసిందని తరుణ్ భాస్కర్ చెప్పుకుంటే , వెంటనే శర్వా కూడా తను ఎదుర్కున్న కష్టాన్ని చెప్పుకున్నాడు. ఇంతకీ శర్వాని ఇబ్బందులకు గురి చేసింది కో అంటే కోటి అనే సినిమా. శర్వానంద్ హీరోగా శ్రీహరి ముఖ్య పాత్రలో ఈ సినిమాకు శర్వానంద్ నిర్మాత. కథను నమ్మి సొంత బేనర్ లో సోదరుడితో కలిసి ఈ సినిమాను ప్రొడ్యూస్ చేశాడు శర్వా. సినిమా రిజల్ట్ తేడా రావడంతో నిర్మాతగా ఫ్లాప్ అందుకున్నాడు అప్పటి నుండి ఇప్పటి వరకూ నిర్మాణం అనే పదం వినడానికి కూడా ఇష్టపడడు శర్వా.

ఈ ఇంటర్వ్యూలో ఆ సినిమా వల్ల పడిన ఇబ్బందులను మనసు విప్పి పంచుకున్నాడు శర్వా. ఆ సినిమా వల్ల నిర్మాతగా అప్పులపాలయ్యానని, అవి తీర్చడానికి దాదాపు ఆరేళ్ళు పట్టిందని అన్నాడు. ఆ సమయంలో కొత్త షర్ట్ కూడా కొనుక్కొలేదని తనలో ఉన్న బాధను బయటపెట్టాడు. ఆ సినిమా తర్వాత బంధువులు కూడా తమని దూరం పెట్టారని పేర్కొన్నాడు. రన్ రాజా రన్ హిట్టాయ్యాక ప్రభాస్ అన్న పార్టీ ఇచ్చాడని కానీ ఆ సినిమా సూపర్ హిట్ అంటే ఆ టైంలో నమ్మలేకపోయానని సోమవారం మాట్లాడుకుందాం అని అంటే ప్రభాస్ అర్థమయ్యేలా చెప్పాడని ఈ సందర్భంగా ఆ ఇన్సిడెంట్ ను కూడా గుర్తు చేసుకున్నాడు శర్వా.