చిరు-నాగ్ సర్దుబాటు

మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున ఎంత మంచి మిత్రులో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. వాళ్లిద్దరి మధ్య వ్యాపార పరమైన బంధం కూడా ఉంది. అలాంటి మిత్రులు ఇప్పుడు బాక్సాఫీస్ సమరానికి సిద్ధమవుతుండటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. దసరా కానుకగా వీరి చిత్రాలు గాడ్ ఫాదర్, ది ఘోస్ట్ ముఖాముఖి తలపడబోతున్నాయి. రెండు చిత్రాలకు దసరా రోజైన అక్టోబరు 5నే రిలీజ్ డేట్ ఖరారైంది.

అధికారికంగానే ఈ తేదీని రెండు చిత్రాల మేకర్స్ ప్రకటించారు. గత రెండు దశాబ్దాల్లో చిరు, నాగ్ ఇలా ముఖాముఖి తలపడిందే లేదు. మరి ఈ క్లాష్ ఇద్దరి ఆమోద యోగ్యమేనా.. వారి రిలేషన్‌ను ఈ పోటీ ఏమైనా దెబ్బ తీస్తుందా అన్న సందేహాలు అభిమానుల నుంచి వ్యక్తమవుతున్నాయి. కానీ దీన్ని ప్రొఫెషనల్‌గా తీసుకుని ఇద్దరూ తమ సినిమాల దసరా విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లు తెలుస్తోంది. కాకపోతే ఇప్పుడో చిన్న సర్దుబాటు జరుగుతున్నట్లు సమాచారం.

ఈ రెండు చిత్రాలను దసరా కానుకగానే రిలీజ్ చేస్తారట కానీ.. అవి ఒకే తేదీన విడుదల కావట్టేదట. ఈ రెండు చిత్రాల్లో ఒకటి ఒక రోజు ముందుగా అక్టోబరు 4న, లేదా ఒక రోజు ఆలస్యంగా అక్టోబరు 6న రిలీజ్ చేయాలని చూస్తున్నారట. దీని వల్ల రెండు చిత్రాల ఓపెనింగ్స్‌‌కు ఢోకా లేకుండా చూసుకోవచ్చని.. దసరా సెలవుల సీజన్ కాబట్టి సినిమాలు బాగుంటే రెండూ బాగానే ఆడేందుకు స్కోప్ ఉంటుందని.. దేనికీ ఇబ్బంది ఉండదని భావిస్తున్నారట.

ఈ మేరకు ఇరు చిత్ర బృందాల మధ్య చర్చలు జరుగుతున్నాయని.. వీటిలో ఒక సినిమాకు రిలీజ్ డేట్ మారడం ఖాయమని.. కొన్ని రోజుల్లోనే ఈ మేరకు ప్రకటన వస్తుందని అంటున్నారు. మలయాళ బ్లాక్‌బస్టర్‌ ‘లూసిఫర్’కు రీమేక్‌గా తెరకెక్కిన ‘గాడ్ ఫాదర్’ను తెలుగువాడైన తమిళ దర్శకుడు మోహన్ రాజా డైరెక్ట్ చేయగా.. ‘ది ఘోస్ట్’కు ‘గరుడవేగ’ ఫేమ్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించాడు. ఈ రెండు చిత్రాల ప్రోమోలు ప్రేక్షకుల దృష్టిని బాగానే ఆకర్షిస్తున్నాయి.