రాజమౌళి ఎందుకంత కష్టపడుతున్నాడంటే..

దర్శక ధీరుడు రాజమౌళి తన సన్నిహితులు, బాగా కావాల్సిన వాళ్ల సినిమాలను ప్రమోట్ చేయడానికి ముందుకొస్తుంటాడు. ఇలా ఆయన్నుంచి ఎక్కువ సాయం అందుకున్న వాళ్లలో సాయి కొర్రపాటి ఒకరు. అలాగే ఇండస్ట్రీలో మరి కొంతమందికి కూడా ఇలా జక్కన్న తోడ్పాటు అందించాడు. ఐతే ఆయన సాయం మహా అయితే ప్రి రిలీజ్ ఈవెంట్లకు అతిథిగా విచ్చేసి నాలుగు ముక్కలు మాట్లాడడం, ట్విట్టర్ ద్వారా ట్రైలర్ లాంచ్ చేయడం, సినిమా చూసి అభినందించడం వరకే ఉంటుంది.

కానీ ‘బ్రహ్మాస్త్ర’ సినిమాకు మాత్రం ఆయన చాలానే చేస్తున్నారు. ఈ సినిమాను దక్షిణాదిన మేజర్ సిటీల్లో ప్రమోట్ చేశారు. అలాగే సినిమాను కొనియాడుతూ వీడియో బైట్లు ఇస్తున్నారు. చివరికి ఆయన ‘బ్రహ్మాస్త్ర’ హీరో హీరోయిన్లు రణబీర్ కపూర్, ఆలియా భట్‌లతో కలిసి సుమ నిర్వహించే ‘క్యాష్’ ప్రోగ్రాంలో సైతం పాల్గొన్నారంటే ఈ సినిమా ప్రమోషన్ కోసం ఎంత కష్టపడుతున్నారో అర్థం చేసుకోవచ్చు.

ఐతే దీని వెనుక కారణం లేకపోలేదు. ఈ చిత్రానికి సమర్పకుడిగా రాజమౌళి పేరు ఊరికే గౌరవార్థం వేయలేదు. ఆయనకు ఈ చిత్రంలో వ్యాపార భాగస్వామ్యం కూడా ఉంది. ‘బ్రహ్మాస్త్ర’ను ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిబ్యూషన్ హక్కులు రాజమౌళే తీసుకున్నారట. తన మిత్రుడైన బళ్ళారి సాయితో డబ్బులు పెట్టించి ఆయన రైట్స్ కొన్నారట. ఇక సమర్పకుడిగా తన పేరును ఉపయోగించడంతో పాటు ప్రమోషన్ల కోసం తాను పడుతున్న కష్టానికి లాభాల్లో వాటా తీసుకోవాలన్నది ఆయన ఆలోచన.

సినిమా అటు ఇటు అయితే తన మిత్రుడు నష్టపోతాడు. తాను పెడుతున్న సమయానికి, పడుతున్న కష్టానికి ఫలితం ఉండదు. అందుకే ‘బ్రహ్మాస్త్ర’ను జక్కన్న అంతగా ప్రమోట్ చేస్తున్నాడు. దీంతో పాటుగా జక్కన్న-బళ్ళారి సాయి భాగస్వామ్యం మరో భారీ చిత్రానికి కూడా కొనసాగబోతోంది. జేమ్స్ కామెరూన్ మాగ్నమ్ ఓపస్ ‘అవతార్-2’ను కూడా ఏపీ వరకు వీళ్లిద్దరే రిలీజ్ చేయబోతున్నారట. ఆ చిత్రాన్ని కూడా జక్కన్న ఇలాగే ప్రమోట్ చేయబోతున్నట్లు సమాచారం.