జనగణమన – మంగళం పాడేశారా

అసలు ఏ ముహూర్తంలో పూరి జగన్నాథ్ జనగణమన టైటిల్ తో కథ రాసుకున్నాడో అది మరీ బ్యాడ్ టైం కాబోలు ఏదీ సవ్యంగా సాగడం లేదు. బిజినెస్ మెన్ జరుగుతున్నప్పుడే ఇది మహేష్ బాబుతో తీస్తానని చెప్పిన పూరి ఏవేవో కారణాల వల్ల దాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లలేకపోయాడు. ఆ తర్వాత వరసగా ఫ్లాపులు రావడం, మహేష్ రిస్క్ చేసే మూడ్ లో లేకపోవడం తదితర అంశాలు ఆ ప్రాజెక్టుని ముందుకు వెళ్లకుండా ఆపాయి.

బడ్జెట్ కూడా చాలా ఎక్కువ డిమాండ్ చేయడంతో పూరి దాన్ని పక్కనపెట్టి ఇస్మార్ట్ శంకర్ తో కంబ్యాక్ అయ్యేదాకా ఎదురు చూశాడు. కట్ చేస్తే లైగర్ ఫలితం దారుణంగా బోల్తా కొట్టేసింది. ఇది కనక బ్లాక్ బస్టర్ అయితే ఆ వచ్చే లాభాలతో, క్రేజ్ తో జనగణమనని నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లొచ్చనే కాన్ఫిడెన్స్ తో ముందుకెళ్లిన పూరి విజయ్ దేవరకొండలకు ఇప్పుడంతా శూన్యమే కనిపిస్తోంది.

నిర్మాణ భాగస్వాములు ఒక్కొక్కరుగా బయటకి వచ్చేస్తున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అప్పో సొప్పో చేసి జనగణమనతో ముందుకెళ్లినా లైగర్ తాలూకు నష్టాలను సాకుగా చూపి బయ్యర్లు దీన్ని చాలా తక్కువకు అడిగే ప్రమాదం ఉంది. ఇవన్నీ ఆలోచించి పూరి జగన్నాథ్ జనగణమణకు మంగళం పాడేశారని లేటెస్ట్ అప్ డేట్.

అధికారికంగా ఇంకా ప్రకటించలేదు కానీ కొంత కాలం సైలెంట్ గా ఉంటే మీడియాతో పాటు జనానికి ఈజీగా అర్థమైపోతుంది కనక అఫీషియల్ గా చెప్తారో లేదో చూడాలి. మిలిటరీ బ్యాక్ డ్రాప్ లో ప్లాన్ చేసుకున్న జనగణమన ప్రీ ప్రొడక్షన్ కోసం గట్టిగానే ఖర్చు పెట్టారు. ఇప్పుడంతా వృథా అయినట్టే. వెంటనే కొత్త ప్రాజెక్టు మొదలుపెట్టడానికి పూరి దగ్గర కథలు ఉన్నా హీరోలు అందుబాటులో లేరు. పైగా లైగర్ షాక్ తర్వాత అంత ఈజీగా ఆయనకు ఓకే చెప్పే స్టార్లు దొరకడం కష్టమే. చూద్దాం.