ఫ్యాన్స్ కి పబ్లిక్ గా ఎన్టీఆర్ సారీ

బ్రహ్మాస్త్ర సినిమాను సౌత్ లో రాజమౌళి ప్రెజెంట్స్ చేస్తుండటంతో ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ తెలుగులోనూ మంచి బజ్ క్రియేట్ చేసుకుంది. ఇప్పటికే రన్బీర్, అలియా, కరణ్ జోహర్ ఈ సినిమా ప్రమోషన్స్ కోసం రెండు మూడు సార్లు హైదరాబాద్ వచ్చారు. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ ను తెలుగులో మరో లెవెల్ కి తీసుకెళ్లేందుకు మేకర్ హైదారాబాద్ లో భారీ ఎత్తున ఆర్బాటంగా రామోజీ ఫిలిం సిటీలో బాహుబలి తరహాలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేసుకున్నారు.

ఎన్టీఆర్ ని గెస్ట్ గా పిలవడంతో రెండు రోజులుగా సోషల్ మీడియా లో NTRforBrahmastra అనే హాష్ ట్యాగ్ తో తారక్ ఫ్యాన్స్ హంగామా చేస్తూ వచ్చారు. తీరా చూస్తే రామోజీ లో జరగాల్సిన భారీ ఈవెంట్ పర్మిషన్ లేని దృష్ట్యా క్యాన్సిల్ అయ్యింది. దీంతో ఉన్నపళంగా టీమ్ ఈవెంట్ ని పార్క్ హయత్ హోటల్ కి షిఫ్ట్ చేసుకున్నారు. ఈవెంట్ లో ఎన్టీఆర్ మైక్ పట్టుకోగానే ముందుగా ఫ్యాన్స్ కి క్షమాపణలు చెప్పుకున్నాడు.

వినాయక చవితి కారణంగా పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వలేమని చెప్పి పర్మిషన్ ఇవ్వలేదని, ఒక దేశ పౌరుడిగా వారి రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేసి వారు మన గురించి ఆలోచిస్తారు కాబట్టి ఈవెంట్ అక్కడ చేయలేక పోయామని అందుకే ఇలా చిన్న వేదికపై మీ ముందు ఉన్నామని అన్నాడు. అలాగే నేషనల్ మీడియా కి తెలుగు మీడియా కి కూడా సారీ చెప్పాడు తారక్. అంతే కాదు ఇదే ఈవెంట్ లో తమ నుండి బెస్ట్ కంటెంట్ కోసం ఆడియన్స్ చూస్తున్నారని, వారి ఊహకు అంచనాలకు తగ్గట్టే బెస్ట్ ఫిలిమ్స్ అందించాలని ఇలా అంటూ నేనెవరినీ కించ పరచడం లేదు అని అన్నాడు.

అలాగే ఈ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసి క్వాలిటీ ఫిల్మ్స్, బెస్ట్ మూవీస్ ఇవ్వాల్సిన బాధ్యత తమపై ఉందని చెప్పాడు. ఇక అమితాబ్ తర్వాత తనకి ఇష్టమైన బాలీవుడ్ నటుడు రన్బీర్ కపూర్ అని అతని నుండి చాలా నేర్చుకున్నానని తెలిపాడు. అలాగే అతను నటించిన రాక్ స్టార్ తనకి ఫేవరెట్ మూవీ అని అందులో సాంగ్స్ చాలా ఇష్టమని చెప్పాడు. ఫైనల్ గా బ్రహ్మాస్త్ర పెద్ద హిట్ అవ్వాలని ఇండియన్ సినిమాకి భారీ విజయం ఇచ్చే బ్రహ్మాస్త్రంగా నిలవాలని కోరుకున్నాడు తారక్.