మ‌హేష్ కోసం మ‌ల‌యాళ సెన్సేష‌న్

సౌత్ ఇండియన్ సినిమాలో క్వాలిటీ ప‌రంగా అత్యున్న‌త స్థాయిలో నిలిచే ఇండ‌స్ట్రీ మాలీవుడ్. అక్క‌డ ద‌శాబ్దాల నుంచి అద్భుత‌మైన సినిమాలు వ‌స్తున్నాయి. అక్క‌డ గొప్ప గొప్ప టెక్నీషియ‌న్లు, ఆర్టిస్టులు ఉన్నారు. కాక‌పోతే వాళ్ల మార్కెట్ చిన్న‌ది. పైగా ద‌క్షిణాదిన మిగ‌తా భాష‌ల‌తో పోలిస్తే మ‌ల‌యాళం అంత స‌రళంగా ఉండ‌దు. అందువ‌ల్ల మ‌ల‌యాళ సినిమా చాలా కాలం పాటు కేర‌ళ దాటి ఎక్కువ మందికి రీచ్ కాలేక‌పోయింది.

కానీ గ‌త కొన్నేళ్ల‌లో ఇంట‌ర్నెట్ విప్ల‌వం, ఓటీటీల జోరు పుణ్య‌మా అని మ‌ల‌యాళ సినిమా రీచ్ బాగా పెరిగింది. ఇప్పుడు ఆ భాషా చిత్రాల‌ను అంద‌రూ బాగా చూస్తున్నారు. అక్క‌డి ద‌ర్శ‌కులు, న‌టుల సత్తా అందరికీ తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే మ‌ల‌యాళ ఆర్టిస్టులు వేరే భాష‌ల సినిమాల్లోనూ అవ‌కాశాలు ద‌క్కించుకుంటున్నారు. తెలుగులో కూడా ఈ మ‌ధ్య మ‌ల‌యాళ న‌టుల ప్రాబ‌ల్యం పెరుగుతోంది. జ‌య‌రాం, ఉన్ని ముకుంద‌న్, గోవింద్ ప‌ద్మ‌సూర్య‌, ఫాహ‌ద్ ఫాజిల్.. ఇలా చాలామంది న‌టులు తెలుగులో అడుగు పెట్టారు.

ఇప్పుడు మ‌రో మ‌ల‌యాళ టాలెంటెడ్ యాక్ట‌ర్ టాలీవుడ్లోకి రాబోతున్న‌ట్లు స‌మాచారం. ఆ న‌టుడి పేరు. రోష‌న్ మాథ్యూ. గ‌త కొన్నేళ్ల‌లో మ‌ల‌యాళంలో ఈ యువ న‌టుడికి చాలా మంచి పేరొచ్చింది. తెలుగులోకి రీమేక్ అవుతున్న‌ క‌ప్పెలాలో అత‌డి పాత్ర భ‌లేగా హైలైట్ అయింది. దీంతో పాటు సీయూ సూన్ లాంటి చిత్రాల్లోనూ అత‌ను ఆక‌ట్టుకున్నాడు.

ఈ యువ న‌టుడు త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో మ‌హేష్ బాబు న‌టించ‌నున్న కొత్త సినిమాలో ఓ కీల‌క పాత్ర చేయ‌నున్నాడ‌ట‌. ఇప్ప‌టికే అల వైకుంఠ‌పుర‌ములో మ‌ల‌యాళీలైన‌ జ‌య‌రాం, గోవింద్‌ల‌ను న‌టింప‌జేసిన మాట‌ల మాంత్రికుడు.. ఇప్పుడు ఓ ఫ్రెష్ ఫేస్ కోసం వెతికి రోష‌న్‌ను ఎంచుకున్న‌ట్లు స‌మాచారం. ఏరికోరి అత‌ణ్ని ఎంచుకున్నాడంటే అది స్పెష‌ల్ రోలే అయి ఉండొచ్చు. సెప్టెంబ‌రులోనే ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్ల‌నుంది. ఈ చిత్రంలో పూజా హెగ్డే క‌థానాయిక అన్న సంగ‌తి తెలిసిందే.