నిఖిల్ దర్శకుడితో బెల్లంకొండ?

హిట్టు ఫ్లాపుతో సంబంధం లేకుండా భారీ బడ్జెట్ సినిమాలతో పట్టువదలని విక్రమార్కుడిలా పలకరిస్తున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గత ఏడాది ఛత్రపతి రీమేక్  ప్రారంభించిన సంగతి తెలిసిందే. వివి వినాయక్ దర్శకత్వంలో అదే టైటిల్ తో కొద్దిపాటి మార్పులతో సగానికి పైగానే షూటింగ్ పూర్తి చేశారు. పెన్ స్టూడియోస్ నిర్మాణం కావడంతో బడ్జెట్ విషయంలోనూ రాజీ లేకుండా చేస్తున్నారని టాక్ వచ్చింది. అయితే ఏమయ్యిందో ఏమో కానీ నెలల తరబడి ఎలాంటి అప్ డేట్ ఇవ్వడం లేదు. వినాయక్ సైతం ఎక్కడా దాని ప్రస్తావన తేవడం లేదు.

ఈ సినిమా కోసమే ముంబైలో మకాం పెట్టేసిన సాయిశ్రీనివాస్ ఆ మధ్య స్టువర్ట్ పురం దొంగను హడావిడిగా ప్రకటించాడు. తీరా చూస్తే అదే కథతో రవితేజ ప్రాజెక్టు లాకవ్వడంతో తనది డ్రాప్ అవ్వాల్సి వచ్చింది. రాక్షసుడు హిట్టు కొట్టి తర్వాత అల్లుడు అదుర్స్ తో డిజాస్టర్ అందుకున్న శ్రీనివాస్ వచ్చే జనవరికి తెరమీద కనపడి రెండేళ్లు దాటుతుంది. ఎంత సక్సెస్ రేట్ తక్కువగా ఉన్నా డబ్బింగ్ శాటిలైట్ తదితరాల రూపంలో ఇతనికి మార్కెట్ అయితే ఉంది. అందుకే తెలుగులో సినిమాలు తీయాలనుకునే వాళ్ళు వస్తూనే ఉన్నారు.

లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం శ్రీనివాస్ ఓ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. నిఖిల్ కు అర్జున్ సురవరం రూపంలో మంచి హిట్ ఇచ్చిన టిఎన్ సంతోష్ చెప్పిన లైన్ ఒకటి ఆకట్టుకోవడంతో ఫైనల్ వెర్షన్ కోసం వెయిట్ చేస్తున్నట్టు తెలిసింది. ఛత్రపతికి ఇంకొంచెం టైం పట్టేలా ఉంది కనక మరీ ఆలస్యం చేస్తే టాలీవుడ్ ప్రేక్షకులకు కనెక్షన్ లైట్ అయిపోతుంది కాబట్టి దీనికి సంబంధించిన నిర్ణయం త్వరలోనే తీసుకోవచ్చని అంటున్నారు. తమ్ముడు గణేష్ అక్టోబర్ లో స్వాతిముత్యంతో వెండితెర ప్రవేశం చేస్తున్నాడు. ఈలోగా అన్నయ్య రీ ఎంట్రీ కన్ఫర్మ్ అవుతుందో లేదో.