ట్రోలర్లకు పండగే పండగ

ఒక సినిమా గురించి దాని టీం మరీ అతిగా చెప్పి, తీరా ఆ సినిమాలో విషయం లేకుంటే ఆటోమేటిగ్గా సోషల్ మీడియాకు టార్గెట్ అయిపోవడం గ్యారెంటీ. అందులోనూ ఆ సినిమాలో హీరో విజయ్ దేవరకొండ అయితే ఇక అంతే సంగతులు. ప్రమోషన్ల టైంలో అతను మామూలుగానే కొంచెం అతి చేస్తాడు. ఇక ‘లైగర్’ విషయంలో అయితే అతను చేసిన అతి అంతా ఇంతా కాదు.

ఇది సాలిడ్ సినిమా అని.. ఆగస్టు 25న ఇండియా షేక్ అయిపోతుందని.. ఈ సినిమా కలెక్షన్లకు సంబంధించి తన లెక్క అయితే రూ.200 కోట్ల నుంచి మొదలవుతుందని.. ఇలా పెద్ద పెద్ద స్టేట్మెంట్లే ఇచ్చాడు విజయ్. ఇప్పుడు ‘లైగర్’ సినిమాకు నెగెటివ్ టాక్ రావడం, సినిమాలో విషయం లేదని తేలిపోవడంతో ఈ స్టేట్మెంట్లన్నీ ట్రోలర్లకు పెద్ద ఆయుధాల్లా మారిపోయాయి. విజయ్‌ని, అతడి సినిమాను ఒక రేంజిలో ట్రోల్ చేస్తున్నారు. తెల్లవారుజామున యుఎస్ ప్రిమియర్స్ టాక్ బయటికి వచ్చినప్పటి నుంచే మొదలైంది మోత. అది అంతకంతకూ పెరుగుతోందే తప్ప తగ్గట్లేదు.

‘ఆగడు’ సినిమాలో ఎమ్మెస్ నారాయణ చెప్పే ‘విషయం వీక్‌గా ఉన్నపుడే పబ్లిసిటీ పీక్స్‌లో ఉంటుంది’ అనే డైలాగ్‌ను ట్యాగ్ చేసే వాళ్లు ఒకరైతే.. ‘‘సినిమా అందరూ అన్నంత చెత్తగా ఏమీ లేదు. దాని కంటే ఇంకా వరస్ట్’’ అంటూ సెటైర్ వేసేవాళ్లు ఇంకొకరు. హిందీలో తెలుగు సినిమాలు బాగా ఆడేసి బాలీవుడ్‌ను దెబ్బ తీస్తున్నాయన్న ఉద్దేశంతో కరణ్ జోహార్ కుట్ర పన్ని ‘లైగర్’ సినిమాను నిర్మించి తెలుగు సినిమాను ఛీకొట్టించేలా చేశాడని ఒక నెటిజన్ కౌంటర్ వేస్తే.. వాట్ లగా దేంగే అంటూ ప్రేక్షకులను ముందే హెచ్చరించినా అర్థం చేసుకోలేకపోయారని ఇంకో నెటిజన్ పంచ్ విసిరాడు.

ఇంకా విజయ్ సినిమా విడుదలకు ముందు ఇచ్చిన ఒక్కో స్టేట్మెంట్‌ను బయటికి తీసి అతణ్ని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. ఈ మాటల అతి తగ్గించుకుని కథల మీద ఫోకస్ పెట్టాలని.. సరైన దర్శకులను ఎంచుకుని మంచి సినిమాలు చేయాలని హెచ్చరికలు జారీ చేస్తున్న వాళ్లు కూడా ఉన్నారు. మొత్తానికి ఈ రోజు మొత్తం సోషల్ మీడియా అంతా ‘లైగర్’ ట్రోలింగ్‌తోనే నిండిపోయేలా కనిపిస్తోంది.