ప్రభాస్-మారుతి.. భయంతోనే ఇలా..

ఓవైపు గురువారం సోషల్ మీడియా అంతటా ‘లైగర్’ నామస్మరణ జరుగుతుంటే.. మరోవైపు చడీచప్పుడు లేకుండా ఒక పెద్ద సినిమాకు సంబంధించిన ముహూర్తం వేడుక జరిగిపోయింది టాలీవుడ్లో. అది ప్రభాస్ హీరోగా మారుతి రూపొందించబోయే సినిమా. సందేహాలకు, సస్పెన్సుకు తెరదించుతూ ఈ సినిమా అధికారికంగా మొదలైపోయింది. ఈ సినిమా గురించి వార్త బయటికి వచ్చినప్పటి నుంచి రకరకాల సందేహాలు వెంటాడుతూనే ఉన్నాయి.

ఆల్రెడీ ఇద్దరు యువ దర్శకులకు ఛాన్స్ ఇచ్చి ‘బాహుబలి’ తర్వాత రెండు పెద్ద డిజాస్టర్లు ఖాతాలో వేసుకున్న ప్రభాస్.. మారుతి లాంటి ఫామ్‌లో లేని, తన రేంజికి తగని దర్శకుడితో సినిమా చేయడం అవసరమా అన్నది అభిమానుల ప్రశ్న. అందులోనూ అతడి లేటెస్ట్ మూవీ ‘పక్కా కమర్షియల్’ డిజాస్టర్ కావడంతో వ్యతిరేకత ఇంకా పెరిగిపోయింది. గురువారం ఈ చిత్రానికి ముహూర్తం అనగానే మారుతిని ఇండస్ట్రీ నుంచే బాయ్‌కాట్ చేయాలంటూ ప్రభాస్ ఫ్యాన్స్ నిన్నట్నుంచి పెద్ద ఎత్తున హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు.

ఈ వ్యతిరేకత చూసి టీం భయపడిందని, ముహూర్త కార్యక్రమాన్ని ఆపేస్తున్నారని బుధవారం సాయంత్రం ప్రచారం జరిగింది. కానీ ఉదయానికి కథ మారిపోయింది. ముందు అనుకున్నట్లే ముహూర్త కార్యక్రమం జరిపించేశారు. కానీ దీనికి మీడియాను పిలవలేదు. ఇండస్ట్రీ నుంచి కూడా అతిథులెవరూ రాలేదు. నామమాత్రంగా కార్యక్రమం ముగించారు. ఈ ప్రారంభోత్సవం గురించి మీడియాకు ప్రెస్ నోట్ ఇవ్వలేదు.

సోషల్ మీడియాలో కూడా ఎలాంటి అధికారిక పోస్టులు, ఫొటోలు కూడా ఏవీ పెట్టే ఉద్దేశాలు లేనట్లు కనిపిస్తోంది. ఇప్పుడు ప్రభాస్ అభిమానులున్న కోపం చూస్తే.. ఈ పోస్టులు పెట్టడం వారిని రెచ్చగొట్టడమే అవుతుందని, వాళ్లు అదుపు తప్పొచ్చని భావించినట్లున్నారు. అందుకే ముహూర్త వేడుక గురించి గోప్యంగా ఉంచినట్లు తెలుస్తోంది.

స్క్రిప్టు లాక్ అయి, ప్రభాస్ కమిట్మెంట్ ఇవ్వడమే కాక డేట్లు కూడా కేటాయించి, నిర్మాత ఓకే అయ్యాక సినిమా విషయంలో వెనక్కి ఎందుకు తగ్గుతారన్నది ఇక్కడ ప్రశ్న. కాకపోతే సినిమా గురించి లో ప్రొఫైల్ మెయింటైన్ చేసి, కంటెంట్‌తోనే సమాధానం చెప్పాలని చిత్ర బృందం ఆలోచన కావచ్చు. ప్రాజెక్ట్-కే, సలార్ చిత్రాల్లో నటిస్తూనే వీలు చిక్కినపుడల్లా ఈ చిత్రానికి కొన్ని డేట్లు సర్దుబాటు చేస్తాడట ప్రభాస్. ఇందులో అతడి సరసన ముగ్గురు హీరోయిన్లు నటిస్తారని సమాచారం.