రాధేశ్యామ్ – లైగర్ నేర్పిన పాఠాలు

‘పుష్ప’ సినిమాలో ఒక్క బాలీవుడ్ నటుడు లేడు. కథ ఉత్తరాది నేపథ్యంతో తెరకెక్కింది కాదు. మామూలుగా చూస్తే అక్కడి ప్రేక్షకుల అభిరుచికి తగ్గ కథ కూడా కాదు. ఈ చిత్రానికి ఉత్తరాదిన ప్రమోషన్లే చేయలేదు. నామమాత్రంగా సినిమాను రిలీజ్ చేశారు. కట్ చేస్తే అది పెద్ద బ్లాక్‌బస్టర్ అయి కూర్చుంది. ఇక ‘కార్తికేయ-2’ది ఇంకో సూపర్ సక్సెస్ స్టోరీ. ఇది కూడా అక్కడి ప్రేక్షకులను టార్గెట్ చేసి తీసిన సినిమా ఏమీ కాదు.

‘కార్తికేయ’కు కొనసాగింపుగా ఆ సినిమా లైన్లోనే దీన్ని కూడా రూపొందించాడు చందూ మొండేటి. ఈ చిత్రానికి కూడా ఉత్తరాదిన ప్రమోషన్లు లేవు. రిలీజ్ మరీ కనీసంగా 50 షోలతో మొదలైంది. అలాంటిది తర్వాత షోలు 3 వేలు దాటేశాయి. ఇక బాహుబలి, కేజీఎఫ్, కేజీఎఫ్-2, ఆర్ఆర్ఆర్ చిత్రాలు కూడా హిందీ ప్రేక్షకులను టార్గెట్ చేసి తీసిన సినిమాలు కావు. అవి పక్కాగా మన కథలు. అవి హిందీ ప్రేక్షకులకు కొత్తగా అనిపించిన వాటిని అపూర్వంగా ఆదరించారు.

కానీ పాన్ ఇండియా లెవెల్లో కొన్ని సౌత్ సినిమాలు సక్సెస్ అయ్యాయి కదా అని.. అక్కడి ప్రేక్షకులను టార్గెట్ చేస్తూ తీసిన సినిమాలు మాత్రం బోల్తా కొట్టడం గమనార్హం. ఆ సినిమాలే.. రాధేశ్యామ్, లైగర్. ఈ రెండు చిత్రాలను తెలుగు ప్రేక్షకులు ఇక్కడి సినిమాల్లాగా ఫీలవ్వలేదు. వాటిలో హిందీ వాసనలు ఎక్కువగా కనిపించాయి. హిందీ ఆర్టిస్టులను ఎక్కువగా పెట్టుకోవడంతో పాటు కథాంశాలు, లొకేషన్లు అన్నీ కూడా నార్త్ ఆడియన్స్‌కు కనెక్ట్ అయ్యేలా చూసుకున్నారు. బాలీవుడ్ టెక్నీషియన్లను తీసుకున్నారు.

పాటలు పూర్తిగా హిందీ ఫ్లేవర్లో తీర్చిదిద్దుకున్నారు. కట్ చేస్తే ఈ రెండు చిత్రాలూ అటు హిందీ ఆడియన్స్‌నూ మెప్పించలేకపోయాయి. ఇటు తెలుగు ప్రేక్షకులనూ సంతృప్తి పరచలేకపోయాయి. మనం మన కథల్ని నమ్మి, మన స్టయిల్లో తీస్తే మన వాళ్లకు నచ్చడమే కాక, హిందీ ప్రేక్షకులు కొత్తగా ఫీలై ఆదరిస్తారన్నది స్పష్టం. వాళ్లు బాలీవుడ్‌ చిత్రాలను డస్ట్ బిన్‌లో పడేసి మన స్టయిల్ సినిమాలే కోరుకుంటున్నపుడు.. మళ్లీ మన వాళ్లు వాళ్ల అభిరుచికి తగ్గట్లు సినిమా తీయాలని ట్రై చేసి బోల్తా కొట్టడం విడ్డూరం. మరి ‘రాధేశ్యామ్’, ‘లైగర్’ సినిమాల ఫలితాలు చూసైనా మన ఫిిలిం మేకర్స్ పాఠాలు నేర్చుకుంటారేమో చూద్దాం.