తప్పు నాదే.. స్టార్ హీరో నిజాయితీ

బాలీవుడ్ ఇప్పుడు పెను సంక్షోభాన్ని ఎదుర్కొంటోందనే చెప్పాలి. కొవిడ్ వల్ల తలెత్తిన నష్టాలు చాలవని, ఆ తర్వాత ఒక్కసారిగా సినిమాలకు ఆక్యుపెన్సీ పడిపోవడం, ఓపెనింగ్స్‌పై తీవ్ర ప్రభావం కనిపిస్తుండడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయారు అక్కడి సినీ జనాలు. ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాలకు 20-30 కోట్ల ఓపెనింగ్స్ కామన్ అన్నట్లుండేది. కానీ ఇప్పుడు అందులో సగం కూడా రావట్లేదు. సినిమాకు టాక్ బాగున్నా కూడా ఆడే పరిస్థితి కనిపించడం లేదు.

దీనికి తోడు ప్రతి సినిమానూ బాయ్‌కాట్ బాయ్‌కాట్ అంటూ ఒక బ్యాచ్ నెగెటివిటీని స్ప్రెడ్ చేస్తోంది. దీంతో వరుసగా సినిమాలు దారుణ ఫలితాన్నందుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో తన కొత్త చిత్రం ‘కట్ పుట్లి’ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో పాల్గొన్న స్టార్ హీరో అక్షయ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేకెత్తించాయి. తమిళ చిత్రం ‘రాక్షసన్’కు రీమేక్‌గా తెరకెక్కిన ‘కట్ పుట్లి’ థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసి నేరుగా హాట్ స్టార్ ఓటీటీలో రిలీజవుతోంది.

ఈ నేపథ్యంలో రకరకాల కారణాల వల్ల థియేటర్లలో రిలీజవుతున్న హిందీ సినిమాలు ఫెయిలవుతున్న పరిస్థితుల్లో ఇక అన్ని సినిమాలనూ ఓటీటీల్లోనే రిలీజ్ చేస్తారా అని ఒక విలేకరి అడిగారు. దానికి అక్షయ్ బదులిస్తూ.. థియేటర్లలో సినిమాలు ఆడట్లేదంటే అవి ప్రేక్షకులకు నచ్చలేదని అర్థమని, అందుకు బాధ్యత వహించాల్సిందే తనే అని తేల్చి చెప్పాడు. ఒక సినిమా పట్టాలెక్కడానికి తానే కారణం కాబట్టి అది ఫెయిలైతే తప్పు తనదే అవుతుందని అక్షయ్ అన్నాడు.

ఇప్పుడు మారిన ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా తాము కూడా మారి, వారికి నచ్చేలా సినిమాలు తీయాల్సిన అవసరం ఉందని అక్షయ్ అభిప్రాయపడ్డాడు. ఎప్పుడూ ప్రేక్షకులను నిందించడానికి వీల్లేదని కూడా తేల్చి చెప్పాడు. తనతో పాటు అందరూ ఇప్పుడు అనుసరిస్తున్న పద్ధతులను పక్కన పెట్టి ప్రేక్షకులకు ఏం కావాలో అది ఇవ్వాలని అక్షయ్ పిలుపునిచ్చాడు. చాలామందిలా ప్రేక్షకులను, సోషల్ మీడియాలో నెగెటివిటీ స్ప్రెడ్ చేసే వారిని నిందించకుండా నిజాయితీగా మాట్లాడి అక్షయ్ మనసులు దోచాడు.