‘లైగర్’కు ఊహించని కష్టం

విజయ్ దేవరకొండ-పూరి జగన్నాథ్‌ల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన ‘లైగర్’ సినిమా ఇంకో ఐదు రోజుల్లోనే థియేటర్లలోకి దిగబోతోంది. ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లోనే కాక విడుదలవుతున్న ప్రతి చోటా మంచి క్రేజే కనిపిస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో, బహు భాషల్లో తెరకెక్కిన ‘లైగర్’ దేశవ్యాప్తంగా భారీ ఎత్తునే విడుదలవుతోంది. అలాగే విదేశాల్లో కూడా రిలీజ్ గట్టిగానే ప్లాన్ చేశారు. యుఎస్‌లో ఈ చిత్రానికి అంచనాలకు మించే బిజినెస్ జరిగింది.

ప్రేక్షకుల్లో ఆసక్తి కూడా బాగానే ఉండడంతో ప్రిమియర్స్ పెద్ద స్థాయిలోనే వేయడానికి ప్రణాళికలు రచించుకున్నారు. ఐతే ఈ ఏర్పాట్లలో ఉండగా యుఎస్ ‘లైగర్’ డిస్ట్రిబ్యూటర్‌కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ‘లైగర్’ సినిమాకు మేజర్ స్క్రీన్లు కేటాయించిన ‘రీగల్’ థియేట్రికల్ ఛైన్ చిక్కుల్లో పడింది. దీని యాజమాన్య సంస్థ సినీ వరల్డ్ గ్రూప్ ఆర్థికంగా దివాళా తీసింది. 2021 సంవత్సరం ఆఖరుకు ఈ సంస్థ అప్పులు 5 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. 

కొవిడ్, ఇతర కారణాలతో ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న సినీ వరల్డ్ గ్రూప్.. కోర్టులో దివాళా పిటిషన్ వేయబోతోంది. దీంతో రీగల్ గ్రూప్ నుంచి ఇప్పటికే పేమెంట్లు రావాల్సిన డిస్ట్రిబ్యూటర్లందరూ తలలు పట్టుకుంటున్నారు. ఈ ఛైన్‌తో ఒప్పందాలు చేసుకున్న రాబోయే చిత్రాలకు కూడా ఇబ్బందులు తప్పవు. దివాళా పిటిషన్ వేసిన నేపథ్యంలో రీగల్ థియేటర్లలో ప్రదర్శనలు ఆగిపోయేలా ఉన్నాయి. దీని వల్ల టాలీవుడ్లో తొలి దెబ్బ తినబోయేది ‘లైగర్’ మూవీనే.

ఈ చిత్రానికి రీగల్ 90 స్క్రీన్లు కేటాయించింది. వీటిలో సినిమా ప్రదర్శితం అయినా పేమెంట్ వస్తుందన్న గ్యారెంటీ లేదు. అందుకే ఇప్పుడు వేరే ప్రత్యామ్నాయాలు వెతుక్కోవాలి. సరిపడా థియేటర్లు దొరక్కపోతే సినిమా బిజినెస్ దెబ్బ తింటుంది. వసూళ్లు తగ్గిపోతాయి. రీగల్ థియేట్రికల్ ఛైన్ చిక్కుల్లో పడడం మున్ముందు టాలీవుడ్‌కు పెద్ద ఇబ్బందే. దీని వల్ల తెలుగు చిత్రాలకు దక్కే థియేటర్లు, షోల సంఖ్య తగ్గుతుంది. యుఎస్‌లో హిందీ చిత్రాలను మించి బిజినెస్ చేస్తాయి తెలుగు సినిమాలు. ‘రీగల్’ ఎఫెక్ట్ టాలీవుడ్‌ను గట్టిగానే తాకేలా ఉంది.