ఇద్దరు మిత్రుల  బాక్సాఫీస్ సమరం

మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున ఎంత మంచి మిత్రులో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సినిమాల పరంగా ఒకరికొకరు ఎప్పుడూ సహకరించుకుంటూ ఉంటారు. వాళ్లిద్దరి మధ్య వ్యక్తిగత, వ్యాపార బంధాలు ఉన్నాయి. ఐతే వీళ్లిప్పుడు బాక్సాఫీస్ ప్రత్యర్థులుగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. గతంలో చిరు-నాగ్ సినిమాలు ఒకదాంతో ఒకటి పోటీ పడ్డ సందర్బాలు లేకపోలేదు. కానీ గత రెండు దశాబ్దాల్లో అలా ఎప్పుడూ జరగలేదు. కానీ ఈ దసరాకు చిరు, నాగ్‌ల మధ్య బాక్సాఫీస్ పోటీ అనివార్యం అయ్యేలా కనిపిస్తోంది.

నాగార్జున కొత్త చిత్రం ‘ది ఘోస్ట్’ ఆల్రెడీ అక్టోబరు 5కు ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే. చాలా రోజుల ముందే డేట్ ఖరారు చేశారు. తాజాగా మరోసారి విడుదల తేదీని రూఢి చేస్తూ చిన్న టీజర్ ఒకటి వదిలారు. విడుదలకు 40 రోజుల ముందే థియేట్రికల్ ట్రైలర్ కూడా లాంచ్ చేసి గట్టిగా ప్రమోషన్లు కూడా చేయబోతున్నారు. అక్టోబరు 5 విషయంలో నాగ్ అసలు తగ్గేలా లేడు.

ఇక చిరంజీవి విషయానికి వస్తే ఆయన కొత్త చిత్రం ‘గాడ్ ఫాదర్’ను ముందు ఆగస్టులోనే రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఆలస్యమైంది. వచ్చే సంక్రాంతికి బాబీతో చేస్తున్న చిరు సినిమా విడుదల కావాల్సి ఉంది. కాబట్టి ముందు వచ్చే సినిమాతో గ్యాప్ ఉండాల్సిందే. అందుకే దసరాకు ‘గాడ్ ఫాదర్’ను విడుదల చేయాలని ఫిక్సయినట్లు తెలుస్తోంది. చిరు పుట్టిన రోజున టీజర్ కూడా వదిలేస్తున్నారు. సినిమా చిత్రీకరణ చివరి దశలో ఉంది. వచ్చే నెల మధ్య కల్లా సినిమా రెడీ అయిపోతుందని అంటున్నారు.

కాబట్టి దసరా సెలవుల్లో రిలీజ్ చేసే మంచి ప్రయోజనం ఉంటుందని భావిస్తున్నారు. బాలయ్య కొత్త చిత్రం కూడా దసరాకు వస్తుందని కొన్ని నెలల కిందట ప్రచారం జరిగింది కానీ.. ఆ చిత్రం వాయిదా పడిపోయింది. ఇంకే పెద్ద సినిమాలు కూడా దసరా రేసులోకి వచ్చే సూచనలు లేవు. ఒకట్రెండు చిన్న సినిమాలేవైనా బరిలో ఉంటే ఉండొచ్చు. ప్రధానంగా దసరా పోటీ చిరు, నాగ్‌ల మధ్యే ఉంటుందన్న ఇండస్ట్రీ వర్గాల సమాచారం. మరి ఈ ఇద్దరు మిత్రులు ఒకేసారి హిట్ కొట్టి బాక్సాఫీస్‌ను కళకళలాడిస్తారేమో చూడాలి.